హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): చండూరు మండలంలోని కస్తాల ఒకప్పుడు పచ్చగుండేది. పచ్చని చేలకు నీళ్లు తాపిన చెరువు ఎండిపోయింది. ఎండిన చెరువులో చేపపిల్లల్లా.. కరు వు కాలంలో చేపలుపట్టే ముదిరాజ్లు అల్లాడిపోయారు. కుల వృత్తిని మాని వ్యవసాయ పనుల్లో, కూలీ పనుల్లోకి చేరిపోయారు. కరువు తీవ్రమయ్యే కొద్దీ ఏ పనీ దొరక్క ఊరు వదిలిపోయారు. 22 ఏండ్ల క్రితం ఎండిన చెరువు ఆ తర్వాత నిండింది లేదు. ఎప్పుడో ఓసారి కోపుల మందం నీళ్లుంటే చేపలు పోశా రు. కానీ, చేప పిల్లలు ఎదగకముందే చెరువు ఎండిపోయేది. ఆ కరువు కాలంలో రెండుసార్లే చేపలు పట్టారట.
తలవంచక తప్పలేదు
చేతినిండా పనిలేక ముదిరాజ్లు వలసబాటపట్టారు. ఆంధ్రాలో చెరుకు పండే కృష్ణా, గోదావరి జిల్లాలకు వలస పోయారు. రోడ్డు పక్కనే దువ్వాకు (చెరుకు ఆకులు) కప్పిన గుడిసెలు వేసుకున్నారు. దూరితే తప్ప పోలేని గుడిసెల్లో ఏటా ఆరు నెలలు తలదాచుకునేవాళ్లు. దూరం పోలేనివాళ్లు హైదరాబాద్లో బత్తాయి, జామపండ్లు అమ్ముకుంటూ బతికారు. కల్లుగీయడం వచ్చినవాళ్లు సూరత్ పోయారు. కూలంటే రోజువారీ వేతనం కాదు. కడుపునిండా అన్నం పెట్టి, ఆశ్రయం ఇవ్వడమే. తిరిగొచ్చేప్పుడు ఆ కాంట్రాక్టర్కి వచ్చిన లాభాన్నిబట్టి దయ తలుస్తాడు. అదే చివరికి మిగిలేదని గ్రామస్థులు చెబుతున్నారు.
మిషన్ కాకతీయ పిలిచింది
‘తిండి దొరికితే చాలనుకునే రోజులు ఎన్నడు పోతయో?’ అని ఎదురుచూస్తున్న కాలంలో తెలంగాణ వచ్చింది. మిషన్ కాకతీయ పనులు మొదలై, ఊరి జనమంతా ఉపాధి కూలీలై పలుగుపార పట్టి మట్టినెత్తారు. చెరువు కట్టను పటిష్ఠంగా నిర్మించుకున్నారు. దశాబ్దాల పూడికను ప్రొక్లెయిన్లతో ఎత్తిపోశారు. పడ్డ చినుకుని పడ్డట్టు చెరువు ఒడిసి పట్టింది. నిండుకుండలా మారింది. పల్లె మళ్లీ పచ్చబడ్డది. కస్తాలలో 300 వరకు ముదిరాజ్ కులస్థుల ఇండ్లు ఉన్నాయి. 150 కుటుంబాల వరకు చేపలు పట్టుకొనే బతుకుతున్నాయి. నవంబరు నుంచి మే వరకు చేపలు పడతారు. ఏడు నెలల్లో రోజుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదిస్తారు. 15 ఏండ్ల క్రితం ఆ ఊరి చెరువులో చేపలుపట్టే వారంతా ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొన్నారు. అప్పటి నుంచి పెద్దగా ప్రయోజనం లేకున్నా ఇప్పుడీ చెరువు నిండటం, తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పోయడంతో సొసైటీలోని సభ్యులు సంతోషంగా ఉన్నారు. ఈసారి 84 వేల చేప పిల్లలు పోశారు. చెరువులో చేపల వేటపై ఆధారపడ్డ కుటుంబాలన్నీ ఇప్పుడు మళ్లీ ఊరికి చేరుకున్నాయి. వరుసగా రెండు సంవత్సరాలు చెరువు నిండడంతో ఇక చెరువు ఎండదని భరోసా లభించిందంటున్నారు.
చెరువునిండితే కడుపు నిండినట్టే..
చేపలు పట్టే పనిలోకి 14 ఏండ్ల వయసులో వచ్చాను. ఏడేండ్లపా టు చేపలు పట్టాను. ఆ తర్వాత చెరువు ఎండింది. అందరికీ చేపల రుచి చూపించే మాకే చేపలు దొరకని స్థితి. మా ఊరికి దగ్గర్లో ఉన్న శెశిలేటి వాగులోని గుంటల్లో చిన్న చిన్న చేపలు పట్టుకుని తిన్నం. కృష్ణా జిల్లా పెనమనూరు రైతులు మమ్మల్ని కూలికి తీసుకుపోయేవాళ్లు. రోడ్ల పక్కనే దువ్వాకు గుడిసెలు కట్టుకున్నాం. సీజన్లో ఆరు నెలలు అక్కడే ఉండేవాళ్లం. ఊరి చెరువు నిండాక మళ్లీ మా కడుపునిండే రోజులొచ్చినయ్. – కట్టా యాదగిరి
మా ఊరికి మంచి రోజులు వచ్చినయ్..
మా ఊరి చెరువు ఎండితే చుట్టుపక్కల ఊళ్లల్లో పనులకు పోయి బతికినం. 1999లో వచ్చిన కరువుకి పక్క ఊళ్లలో కూడా పంటలు పండలే. హాలియా దగ్గర ఉన్న నిడుమనూరుకి నాట్లకు వలస పోయినం. వరి కోతలకూ అదే ఊరికి పోయి ఉన్నం. మా అన్న, వదిన, నేను, నా భార్య అందరం కలిసి ఏడాదికి నాలుగుసార్లు వలసపోయినం. పోయినప్పుడల్లా నెల రోజులు ఉండి వచ్చినం. అయిదేండ్లు అలానే బతికినం. ప్రతి ఒక్కరూ మురిసిపోయే కాలం ఇది. వలస పోయినోళ్లంతా తిరిగొచ్చి ఊళ్లోనే మంచిగ బతుకుతున్నారు. చేపలు పట్టేవాళ్లే కాదు రైతులకూ మంచిరోజులొచ్చాయి. చెరువు నిండితే బావులు, బోర్లు ఎండట్లేదు. ఒకప్పుడు 10 గుంటల భూమికి కూడా బోరు నీరు పారేది కాదు. ఇప్పుడు ఎకరాలకెకరాలు పారుతుంది. చెరువు నిండినంక సకలం ఆనందం. – గంటా నగేశ్
పిల్లల చదువుల్ని చక్కబెడతాం
పిల్లల్ని ముసలోళ్లకు అప్పజెప్పి దూరం పనులకు పోయినం. వాళ్లకు చేతగాక, పిల్లల్ని చూసుకునేవాళ్లు లేక చదువుల్లో వెనుకబడ్డారు. ఇన్నాళ్లకు మంచి రోజులొచ్చినయ్. మా ఊరి చెరువు మాకు భరోసానిచ్చింది. ఊళ్లోనే ఉంటున్నాం. పిల్లల చదువుల్ని చక్కబెడతాం. – ఇందిరమ్మ
చెరువు నిండితే కండ్లల్ల నీళ్లు నిండినయ్
చెరువు మీద ఆధారపడి 60 మత్స్యకార కుటుంబాలు బతుకుతున్నాయి. కరువు కాలంలో బత్తాయిలు అమ్మి బతికిన. నిరుడు చెరువు నిండింది. వలసపోయిన మత్స్యకార్మికులు, కూలీలు ఊరికి తిరిగొచ్చారు. కూలీనాలీ చేసుకుంటూ, చేపలు పట్టుకుంటూ ఊరిలోనే ఉంటున్నం.
– గంటా రమేశ్, అధ్యక్షుడు, కస్తాల మత్స్యకార్మిక సంఘం