హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బుధవారం క్రైస్తవులకు విందు ఇవ్వనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాంగణానికి చేరుకొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం విందు ప్రారంభం కానున్నది. ఇందులో సుమారు 12,000 మంది పాల్గొంటారు.
విందు ఏర్పాట్లను మంగళవారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, స్టీఫెన్సన్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్రావు, సురభి వాణీదేవి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్సాగర్, మైనారిటీ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ తదితరులతోపాటు అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్రిస్మస్ వేడుకలను అధికారికంగా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. విందులో సీఎం కేసీఆర్ పాల్గొని క్రైస్తవ సోదరురులతో కలిసి డిన్నర్ చేస్తారని చెప్పారు. విందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్టు పూర్తయ్యాయని తెలిపారు. సాయంత్రం ఐదు గంటల్లోగా అందరూ ఎల్బీస్టేడియానికి చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులను కూడా ప్రదానం చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.