హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) పరిధిని మరింత విస్తరించడంతోపాటు స్వీయ ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు సూచించారు. వైటీడీఏ, శిల్పారామాల అభివృద్ధిపై బుధవారం బీఆర్కే భవన్లో ఆమె ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతూ.. ప్రస్తుతం 7 గ్రామాలకే పరిమితమైన వైటీడీఏ పరిధిని విస్తరించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
యాదాద్రి నిర్మాణం అద్భుతంగా ఉన్నదని, మున్ముందు తిరుమల తిరుపతి దేవస్థానం స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వైటీడీఏ వీసీ, సీఈవో కిషన్రావు తదితరులు పాల్గొన్నారు.