మద్దూర్(కొత్తపల్లి), ఆగస్టు 26 : ‘కాంగ్రెస్కు ఓట్లేసి మా నోట్లో మేమే మన్ను పోసుకున్నం’ అని నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన మహిళలు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఎదుట వాపోయారు. కొత్తపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయి ఆత్మహత్యకు యత్నించిన యాదగిరిగౌడ్ కుటుంబాన్ని బుధవారం పట్నం పరామర్శించారు. అలాగే విస్తరణలో కూల్చేసిన ఇండ్లను పరిశీలించారు.
అలాగే కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో పింఛన్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మహిళలు అంజిలమ్మ, భారతమ్మ, బుడ్డమ్మ.. పట్నం నరేందర్రెడ్డి ఎదుట తమ గోడువెళ్లబోసుకున్నారు. ‘రేవంత్రెడ్డి మాటలు నమ్మి.. మా నోట్లో మేమే మన్ను పోసుకున్నం సారూ’.. అంటూ కన్నీళ్లు పెట్టుకొన్నారు. ‘నమ్మి ఓట్లేస్తే మా భూములను కాజేసి, మా ఇండ్లను కూలుస్తున్నాడు’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనే బాగుండే సారూ.. అంటూ గుర్తుచేసుకున్నారు. తమను బాధ పెట్టిన సర్కారోడు నాశనమైపోతాడంటూ సీఎం రేవంత్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్తపల్లిలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయి ఆత్మహత్యకు యత్నించిన యాదగిరిగౌడ్ మాట్లాడుతూ.. ‘నాలుగు నెలల కిందట నా ఇల్లు కూల్చారు.
మిగిలిన ఇంటిని బాగు చేసుకొని హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తుంటే.. నాపై కక్షతో మరోసారి మిగిలిన భాగాన్ని కూడా కూల్చేందుకు బుల్డోజర్లు పంపించారు’ అంటూ పట్నం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం పట్నం అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రాలేమని తెలిసే సీఎం సోదరులు భూ కబ్జాలతో బరితెగించారని విమర్శించారు. కాంగ్రెస్ను నమ్మి గెలిపించిన ప్రజల ఇండ్లనే కూలుస్తున్నారని మండిపడ్డారు. రోడ్డు విస్తరణ పనులు నిబంధనల మేరకు చేపట్టడం లేదని, ఇలాగే కొనసాగిస్తే బాధితుల తరపున కొత్తపల్లి చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే బాధితులతో కలిసి న్యాయపోరాటానికి సిద్ధమని స్పష్టంచేశారు. కేసీఆర్ మళ్లా సీఎం కాగానే బాధితులకు 200 గజాల ప్లాటుతోపాటు పింఛన్లు కోల్పోయిన వారికి తిరిగి పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.