భీమారం, సెప్టెంబర్ 28 : ‘డబ్బు ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నం. ఇప్పుడొచ్చి చెరువులో మా ఇండ్లున్నయంటున్నరు. గవ్విటిని కూల్చుతమని నోటీసులిచ్చిన్రు. బాంచన్ కాల్మొక్తం. మాకు న్యాయం చేయుండ్రి’ అంటూ మంచిర్యాల జిల్లా భీమారం మండలం సుంకరిపల్లి గ్రామస్థులు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ కాళ్లపై పడ్డారు. శనివారం భీమారంలోని రైతువేదిక వద్ద వివేక్ అధికారులతో కలిసి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ప్రొసీడింగ్తోపాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. భీమారానికి చెందిన 40 మంది చిరువ్యాపారులు కూడా అక్కడికి చేరుకొని తమ గోడువెల్లబోసుకున్నారు. చెరువు శిఖంలో కట్టడాలున్నాయని తమకు నోటీసులిచ్చారని.. న్యాయం చేయాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు.
ఇంతలోనే అక్కడున్న కాంగ్రెస్ నాయకులు కలుగజేసుకొని పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో.. ఎమ్మెల్యే అసహనం వ్యక్తంచేశారు. ఇలా మిస్గైడ్ చేస్తే కలెక్టర్కు తానేమి చెప్పాలని అన్నారు. ఇంతలోనే బాధితులు మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఎమ్మెల్యే స్పందిస్తూ స్వయంగా సీఎం రేవంత్రెడ్డి వాళ్ల అన్నకే నోటీసులు ఇచ్చారంటూ చీదరించుకున్నారు. ఈ క్రమంలో ఓ అగ్రవర్ణ కాంగ్రెస్ నాయకుడు.. సుంకరపల్లి దళిత మహిళలను వివేక్ కాళ్లు మొక్కాలని ప్రోత్సహించాడు. బాధితులకు న్యాయం చేయాలని పోడెటి రవితో పాటు మాజీ జడ్పీటీసీ జర్పుల రాజ్కుమార్ నాయక్ వర్గం ప్రయత్నం చేస్తుండగా, కాంగ్రెస్ జిల్లా నాయకుడు చేకూర్తి సత్యనారాయణరెడ్డి వర్గం మాత్రం చెరువును కబ్జాల నుంచి కాపాడాలని కలెక్టర్కు ఫిర్యాదు చేయడం గమనార్హం.