గుమ్మడిదల, డిసెంబర్ 17: సంగా రెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డ పోతారం పారిశ్రామికవాడలోని హెటిరో పరిశ్రమలోకి చిరుత పులి చొరబడింది. పక్కనే అటవీ ప్రాంతం ఉండటంతో అం దులో నుంచి వచ్చి పరిశ్రమలోని హెచ్ బ్లాక్లో నక్కింది. శనివారం ఉదయం 4 గంటలకు మొదటి షిప్టు ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. వారు డ్యూటీ ప్రారంభిస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ఏదో సంచరిస్తున్నట్టు కనిపించింది. ఆ ప్రాణిని చిరుతగా గుర్తించారు. 20 మందికిపైగా కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. కంపెనీ హెచ్ఆర్ ద్వారా విషయం తెలుసుకున్న అటవీ, పోలీస్, నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు హెటిరో పరిశ్రమ వద్దకు చేరుకొని, లోపల చిరుతపులి ఉన్నట్టు నిర్ధారించారు.
డీఎఫ్వో శ్రీధర్ బాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేంద్రబాబు, బొల్లారం సీఐ సురేందర్రెడ్డి, హైదరాబాద్లోని జూపార్క్ క్యూరేటర్ శ్రీదేవి, రెస్క్యూ టీం నవీన్ బృందం ఆరు గంటల పాటు శ్రమించి దానిని పట్టుకున్నారు. మొదట 3 బోన్లు, వలలు ఏర్పాటు చేశారు. మేకను ఎరగా వేసి పట్టుకునే ప్రయత్నం చేసినా చిరుత బయటకు రాలేదు. గోడకు రంధ్రాలు చేసి అందులో నుంచి పైపుల ద్వారా ప్రెషర్తో నీటిని చిరుతపైకి చిమ్మారు. ఫలితం లేకపోవడంతో చివరకు డాట్గన్ ద్వారా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. కొద్దిసేపటికే చిరుత స్పృహ కోల్పోగా.. బంధించి హైదరాబాద్లోని జూకు తరలించారు. చికిత్స చేసిన అనంతరం వన్యప్రాణి సంరక్షణ అధికారులకు అప్పగించనున్నట్టు జూ అధికారులు తెలిపారు.