హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): హెమోస్ప్రే పద్ధతితో అప్పర్ జీఐ రక్తస్రావాన్ని అరికట్టవచ్చని ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి చెప్పారు. కేవలం పది నిమిషాల్లోనే శరీరంలో అంతర్గతంగా జరిగే రక్తస్రావాన్ని నిలిపివేసి రోగి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఈ పద్ధతిని ఏఐజీలో ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. దవాఖానలో ఏర్పాటుచేసిన సమావేశంలో హెమోస్ప్రే పద్ధతిని మీడియాకు వివరించారు. ఎండోస్కోపిక్ విధానంలోనే హెమోస్ప్రే అనే పద్ధతి ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పారు. హెమోస్ప్రే పద్ధతి రోగి ప్రాణాలు రక్షించడంతోపాటు ఆరోగ్య సంరక్షణలో గేమ్ఛేంజర్గా పనిచేస్తుందని తెలిపారు. దేశలోనే తొలిసారిగా ఏఐజీలో డాక్టర్ మోహన్రామ్చందానితో కలిసి లివర్ సిరోసిస్తో బాధపడుతున్న 49 ఏండ్ల రోగికి ఈ విధానంతో చికిత్స అందించినట్టు డాక్టర్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. సదరు రోగిలో నలుపు రంగుతో కూడిన మల విసర్జన లక్షణాలు కనిపించడంతో అతడి కడుపులో రక్తస్రావం జరుగుతున్నట్టు గుర్తించామని, హెమోస్ప్రే పద్ధతిలో చికిత్స అందించామని తెలిపారు.