హైదరాబాద్, జూన్14 (నమస్తే తెలంగాణ): విద్యారంగ చరిత్రలో సీఎం కేసీఆర్ విప్లవం సృష్టించారని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కొనియాడారు. జిల్లాకో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దకుతుందని అన్నారు. దేశచరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా బీసీ విద్యార్థుల కోసం ఇంత పెద్ద సంఖ్యలో డిగ్రీ కాలేజీలను ప్రారంభించలేదని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీల కోసం ప్రత్యేకంగా గురుకుల విద్యావ్యవస్థను నెలకొల్పి రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ పాఠశాలలు 327కి పైగా నెలకొల్పడం విద్యారంగ చరిత్రలో విప్లవమని అభివర్ణించారు. గురుకులాల్లో చదువుకుంటున్న 1,68,000 మంది బీసీ బిడ్డలకు మరో 17 డిగ్రీ కాలేజీల మంజూరు విద్యాదినోత్సవ తీపికబురుగా సంబురాలు జరుపుకుంటారని తెలిపారు.