హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ప్రముఖ జర్నలిస్టు కేఎల్ రెడ్డి పేరిట మెమోరియల్ అవార్డును అందించనున్నట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ప్రెస్అకాడమీలో అల్లం నారాయణ సమక్షంలో కేఎల్ రెడ్డి తమ్ముడు ఇంద్రసేనారెడ్డి, అల్లుడు లింగారెడ్డి, అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు కేఎల్ రెడ్డి అనారోగ్యంతో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.15 లక్షలను మం జూరు చేయించారు.
అప్పుడు ఆశ్రమంలో చికిత్స పొందుతున్న ఆయన వైద్య ఖర్చులకు ఈ డబ్బులను వినియోగించాలని ముఖ్యమంత్రి కోరారు. కేఎల్ రెడ్డి 2022 నవంబర్ 3న చనిపోవటంతో ఆయన జ్ఞాపకార్థంగా ఒక మెమోరియల్ ట్రస్టును ఏర్పాటు చేయాలని కుటుంబసభ్యులు భావించారు. ఈమేరకు ప్రభుత్వం ఇచ్చిన రూ.15 లక్షల్లోంచి రూ.9 లక్షలను ప్రెస్అకాడమీకి ఇచ్చి.. వాటిపైన వచ్చే వడ్డీతో ఏటా ‘కేఎల్ రెడ్డి మెమోరియల్ ఉత్తమ జర్నలిస్టు అవార్డు’ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి ఏటా నవంబర్ 3న ఇచ్చే ఈ అవార్డు ఎంపికకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రెస్అకాడమీ అధ్యక్షుడు చైర్మన్గా ఉండే ఈ కమిటీలో ఇద్దరు ప్రముఖ జర్నలిస్టులు, కేఎల్ రెడ్డి కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు, అకాడమీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారని ప్రెస్అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలియజేశారు.