మేడిపండు చూడ మేలిమై ఉండు..పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టు.. అగ్రరాజ్యమైన అమెరికాలో అడుగడుగునా అనాగరికత రాజ్యమేలుతున్నది. దారి దోపిడీలు, దాడులు, కాల్పులు నిత్యకృత్యాలయ్యాయి. ఉన్నత చదువుల కోసమో.. ఉద్యోగాల కోసమో అమెరికా బాట పట్టిన మన భారతీయులే టార్గెట్గా ఇటీవల దాడులు పెరిగిపోతున్నాయి. అమెరికా వెళ్లే భారతీయులకు విదేశాంగ శాఖ కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తాజాగా జరిగిన దాడి నిరూపిస్తున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 7: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి మజార్ అలీపై ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి.. అతడిని దోచుకున్న సంఘటన అటు అమెరికాతో పాటు ఇటు ఇండియాలో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరలయ్యాయి. అమెరికాలో ఉంటున్న భారతీయులపై వరుస దాడులు జరగటంపై దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా మారటంతో..షికాగోలోని భారత కాన్సులేట్ రంగంలోకి దిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక అధికారులను కాన్సులేట్ సంప్రదించింది.
ఆదివారం అమెరికాలోని ఇండియానా వెస్లియస్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చదువుతున్న హైదరాబాద్కు చెందిన మజార్ అలీపై క్యాంప్బెల్ అవెన్యూలో దుండగులు దాడి చేసి దోచుకున్న సంగతి తెలిసిందే. మజార్ అలీ భార్య హైదరాబాద్లోని లంగర్హౌస్లో తన ముగ్గురు చిన్నారులతో నివసిస్తున్నారు. భర్తపై దాడి జరిగిన విషయం తెలియగానే షాక్కు గురైన సయ్యదా రుక్వియా ఫాతిమా రజ్వీ వెంటనే విదేశాంగ మంత్రి జైశంకర్కి విజ్ఞప్తి చేసింది. తన భర్తకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని కోరింది. అలాగే తన పిల్లలతో సహా తాను అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా కోరింది. దాడి జరిగాక తన భర్త తానుంటున్న అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లటానికి భయపడుతున్నాడని, ఈ సమయంలో తన భర్త పక్కన తానుండటం అవసరమని, తద్వారా అతను త్వరగా కోలుకుంటాడని ఆమె అభిప్రాయపడింది. కేంద్ర మంత్రి జైశంకర్కి ఫాతిమా లేఖ అందగానే షికాగోలోని భారత కాన్సులేట్ రంగంలోకి దిగింది. హైదరాబాద్లో ఉన్న మజార్ అలీ భార్యతో సంప్రదింపులు జరుపుతున్నామని..బాధితుడికి అవసరమైన అన్ని రకాల సహాయం చేస్తామని భారత కాన్సులేట్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పేర్కొన్నది.
అమెరికాలో గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. మరికొందరు అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోతున్నారు. జనవరి మొదలు వరుసగా భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులు కలవరపెడుతున్నాయి. ఇటీవల ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీలో భారతీయ విద్యార్థి శవమై కనిపించగా, తాజాగా షికాగోలో భారతీయ ఐటీ విద్యార్థిపై దారుణ దాడి జరిగింది. తాజా ఘటన ఈ ఏడాదిలో ఆరోది. పర్డ్యూ యూనివర్సిటీలోని మెకానికల్ ఇంజినీరింగ్ డాక్టోరల్ విద్యార్థి సమీర్ కామత్ (23) మృతదేహం సోమవారం వారెన్ కౌంటీలో కనిపించింది. షికాగోలో ఆదివారం జరిగిన మరో ఘటనలో భారతీయ ఐటీ విద్యార్థి సయ్యద్ మజార్ అలీ దారుణంగా గాయపడ్డాడు. ముగ్గు రు వ్యక్తులు అతడిని చేజ్ చేసి ముఖంపైన, పక్కటెముకల్లో పిడిగుద్దులు కురిపించారు. తీవ్రంగా గాయపడిన అలీ స్థానిక దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ముక్కు పగిలి రక్తం కారుతూ, ముఖమంతా రక్తపు మరకలతో ఉన్న వీడియోను సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో షేర్ చేసిన అలీ తనపై దాడి ఘటనను వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చిం ది.
ఆరు నెలల క్రితమే అతడు ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లాడు. దుండుగులు అతడికి తుపాకి కూడా గురిపెట్టినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఇండియానా వెస్లేయన్ యూనివర్సిటీలో అలీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చదువుతున్నాడు. గతవారం ఓహియోలోని లిండెర్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుతున్న 19 ఏండ్ల శ్రేయాస్రెడ్డి బెనిగెర్ శవమై కనిపించాడు. గత నెల 28న పర్ డ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య కూ డా అనుమానాస్పదస్థితిలో మరణించాడు. అం తకుముందు జనవరి 16న లిథోనియా నగరంలో 25 ఏండ్ల వివేక్ సైనీ డ్రగ్స్కు బానిసైన వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అంతకంటే ముందు హైపోథెర్మియాతో బాధపడుతూ ఇల్లినాయిస్ యూనివర్సిటీ విద్యార్థి అకుల్ డీ ధావన్ మృతి చెం దాడు. అమెరికాలో భారతీయుల వరుస మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2023 నవంబర్ ఓపెన్డోర్స్ నివేదిక ప్రకారం యునైటెడ్ స్టేట్స్లో చదువుతున్న ఒక మిలియన్ విదేశీ విద్యార్థుల్లో 25 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య 35 శాతం పెరిగింది. 2022-23 విద్యా సంవత్సరంలో 2,68,923 మంది విద్యార్థులతో ఆల్టైమ్ హైకి చేరుకున్నదని నివేదిక వెల్లడించింది. నిరుడు ఇండియాలోని యూఎస్ కాన్సులర్ బృందం లక్షా 40 వేల కంటే ఎక్కువ విద్యార్థి వీసాలు జారీ చేసింది. ప్రపంచంలోని ఏ దేశానికి ఇన్ని వీసాలు జారీ కాలేదు. వరుసగా మూడో సంవత్సరం కూడా వీసా జారీలో రికార్డు సృష్టించింది.
అమెరికాలో తెలుగు విద్యార్థులపై జరుగుతున్న వరుస దాడుల పట్ల సీఎం రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ విద్యార్థి మజార్ అలీపై చికాగోలో దుండగులు దాడి చేయడంతోపాటు ఓహియో రాష్ట్రంలో శ్రేయాస్రెడ్డి అనే విద్యార్థిని హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. వరుస ఘటనల నేపథ్యంలో విదేశాల్లోని భారతీయ విద్యార్థుల భద్రతను సమీక్షించాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ను కోరారు. అమెరికాతోపాటు విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డల కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వారి ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.