విద్యుత్తు ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు.. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర
విద్యుత్తు సవరణ బిల్లు ముసాయిదా ప్రతిపాదనలను వెల్లడించిన కేంద్రం
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నా.. ముఖ్యమంత్రులు లేఖలు రాసినా.. ఉద్యోగులు గగ్గ్గోలు పెడుతున్నా.. సంఘాలు సమ్మెకు దిగుతామంటున్నా.. ఇవేం పట్టనట్టుగా కేంద్రంలోని మోదీ సర్కారు విద్యుత్తు ప్రైవేటీకరణకు గేట్లు తెరిచింది. ఎవరు అభ్యంతరం పెట్టినా.. ఎంత మొత్తుకున్నా.. తమకేం పట్టనట్టుగా ప్రభుత్వ రంగంలోకి విద్యుత్తు సంస్థలను పణంగా పెట్టేందుకు సిద్ధపడింది. ఈ మేరకు ‘ది ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ -2022’ను ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. స్వల్పమార్పులు చేసిన ముసాయిదా ప్రతిపాదనలతో కూడిన నివేదికను కేంద్ర విద్యుత్తు శాఖ బుధవారం విడుదలచేసింది. రాష్ర్టాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నామంటూ నాలుగు ప్రతిపాదనలను ఉపసంహరించుకుంటున్నట్టు ఆ నివేదికలో పేర్కొన్నది. పంపిణీ విధానంలో డీ లైసెన్సింగ్, రాష్ర్టాలు దాటి విద్యుత్తు విక్రయాలు, ఈఆర్సీల స్థానంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఈఆర్సీ చైర్మన్, సభ్యులను నియమించడం వంటి కొన్ని మార్పులను చేసింది. కానీ, ప్రభుత్వ రంగంలోకి డిస్కంలకు ఉరితాళ్లు బిగించి.. ప్రైవేట్కు ధారాదత్తం చేసేలా తాజా ప్రతిపాదనలను చేసింది. ప్రైవేట్ డిస్కంలకు లైసెన్స్ అవసరం లేదని గతంలోని బిల్లులో ప్రకటించగా, కొత్తగా లైసెన్స్ వ్యవస్థ ఉంటుందని కేంద్రం తెలిపింది.
ఒకే ప్రాంతంలో రెండు మూడు డిస్కంలు..
తాజా విధానంలో ఒకే ప్రాంతంలో విద్యుత్తు సరఫరా చేసేందుకు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వచ్చినా ఈఆర్సీ వాటికి లైసెన్స్లు జారీచేయాల్సిందే. ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రస్తుతమున్న డిస్కంలకు చెందిన విద్యుత్తు స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లను వాడుకోవచ్చు. గతంలో కంపెనీలు విద్యుత్తు పంపిణీ కోసం తమ సొంత నెట్వర్క్ను ఏర్పాటు చేసేకోవాల్సి ఉండేది. ఇప్పుడు సొంత నెట్వర్క్ లేకపోయినా ప్రభు త్వ డిస్కంల నెట్వర్క్నే వాడుకొనేలా మార్పులు చేశా రు. ఒకే ప్రాంతంలో విద్యుత్తు సరఫరా చేసే ఇతర డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఓపెన్ యాక్సెస్ విధానం సదుపాయాలన్నీ తప్పనిసరిగా కల్పించాలనే నిబంధనను చేర్చబోతున్నారు. అంటే కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తమ సరఫరా వ్యవస్థలను వాడుకోవడానికి ప్రభుత్వ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తప్పనిసరిగా అనుమతినిచ్చి తీరాల్సిందే. ఇందుకు ప్రతిఫలంగా వీలింగ్ చార్జీలను ప్రభుత్వ డిస్కంలకు ప్రైవేట్ కంపెనీలకు చెల్లిస్తాయి. వాటిని డిస్కంలు మహా ప్రసాదంగా స్వీకరించాలని కేంద్రం తమ విధానాల్లో ప్రకటించింది.