హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలో 65 ఏండ్ల క్రితం నిర్మించిన కడెం నారాయణ ప్రాజెక్టుకు కొత్త స్పిల్వేను నిర్మించాలని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ సిఫారసు చేసింది. ఆ డ్యామ్ రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు ప్రతిపాదలు చేసింది. 700 అడుగుల ఎఫ్ఆర్ఎల్, 9 మీట ర్ల ప్రీ బోర్డు లెవల్, 3 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టును గతంలో ఎన్నడూ లేనివిధంగా నిరుడు 5.20 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది. ఒకదశలో ఎఫ్ఆర్ఎల్ను దాటి 705 ఫీట్ల వరకు నీరు చేరుకోవడంతో ఎడమ గట్టు వైపున కొంత బుంగ పడింది. ఇటీవల కూడా 3.20 క్యూసెక్కుల వరద ఈ ప్రాజెక్టును ముంచెత్తిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఇప్పటికీ భద్రమేనా? కాదా? అనే అంశంపై అధ్యయనం చేసేందుకు సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ నిపుణుడు ఏబీ పాండ్యా ఆధ్వర్యంలో కేంద్ర అధికారులు, నిపుణులు, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అధికారులు ఇటీవల ఈ ప్రాజెక్టును పరిశీలించారు.
ఈ ప్రాజెక్టు మ్యాప్తోపాటు గత రెండేండ్లలో జరిగిన నష్టానికి సంబంధించిన ఫొటోలు, 18 వరదగేట్లు, కాలువ పరిస్థితులు, ఎగువ నుంచి వచ్చే ఇన్ఫ్లో, ఔట్ఫ్లో, గేట్ల కౌంటర్ వెయిట్లు, అదనపు స్పిల్వే సామర్థ్యం, లోడ్ డిశ్చార్జి తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆనకట్ట భద్రత, గేట్లకు సంబంధించిన సమస్యలపై అధికారులతో చర్చించి, డ్యామ్ రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సిఫారసులు చేశారు. ప్రధాన స్పిల్వేను కొత్తగా పునర్నిర్మించడంతోపాటు వరద సామర్థ్యానికి అనుగుణంగా అదనపు వెంట్లను ఏర్పాటు చేయాలని, డ్యామ్ కరకట్టలను మరింత బలోపేతం చేయాలని ప్రతిపాదించారు. డ్యామ్కు వస్తున్న వరదను అంచనా వేసి, తదనుగుణంగా ఔట్ఫ్లోను నియంత్రించేందుకు క్యాచ్మెంట్ ఏరియాలో గేజిం గ్ మీటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలిపారు. మరోవైపు డ్యామ్ సేఫ్టీ అధికారులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)ను కూడా సందర్శించారు. ఆ ప్రాజెక్టు నిర్వహణ బాగున్నదని కితాబిచ్చారు.