(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): అఖిల భారత సర్వీసు అధికారుల పదోన్నతికి సంబంధించిన వివాదాస్పద ‘360 డిగ్రీల’ విధానంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వెనక్కి తగ్గింది. ఈ విధానాన్ని అమలు చేయట్లేదని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్కు (క్యాట్) ఇటీవల స్పష్టంచేసింది. తనకు పదోన్నతిని తిరస్కరించారంటూ ఐఎఫ్ఎస్ అధికారి సంజీవ్ చతుర్వేది బెంచ్ ముందు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. 360 డిగ్రీల విధానాన్ని అనుసరించి.. తనపై సేకరించిన సమీక్షా వివరాలను సమర్పించేలా కేంద్రానికి ఆదేశాలనివ్వాలంటూ అభ్యర్థించారు. ఈ క్రమంలో జరిగిన విచారణలో 360 డిగ్రీల విధానాన్ని తాము అమలు చేయట్లేదని కేంద్రం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. కాగా, సివిల్ సర్వీస్ అధికారులకు పదోన్నతి కల్పించే ముందు సీనియర్లు, సహోద్యోగులు, జూనియర్ అధికారులు, వినియోగదాల నుంచి అభిప్రాయాలను సేకరించే 360 డిగ్రీల విధానాన్ని తీసుకొస్తున్నట్టు 2020లో కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. అయితే, ఈ విధానం వల్ల పదోన్నతుల్లో పారదర్శకత లోపించవచ్చని, పాలకవర్గానికి అనుకూలంగా ఉన్నవారికే ప్రమోషన్లు లభించవచ్చని విమర్శలు వచ్చాయి. రానున్న ఎన్నికల్లో నష్టం జరుగకూడదనే ఉద్దేశంతో కేంద్రం యూటర్న్ తీసుకొన్నట్టు సమాచారం.