హైదరాబాద్, జూన్13 (నమస్తే తెలంగాణ): ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్న చందంగా తయారైంది రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పరిస్థితి. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగం నిర్మాణానికి అనుమతులు లభించిన తరువాత రహదారులశాఖ అధికారులు నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించి, కేంద్రానికి పంపించారు. ఏయే సర్వే నెంబర్లలో ఎంత భూమి అవసరం? జంక్షన్లకు ఎంత భూమి అవసరం? తదితర వివరాలను ఇందులో పొందుపరిచారు. దీంతో కేంద్ర రహదారులశాఖ మార్చి చివరి వారంలోనే స్మాల్(ఏ) గెజిట్ను విడుదల చేసింది.
ఆ తరువాత పది రోజుల్లో విడుదల చేయాల్సిన క్యాపిటల్(ఏ) గెజిట్ను మూడు నెలలైనా జారీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. దీంతో రీజినల్ రింగ్రోడ్డు నిర్మాణం ముందుకు సాగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను పూర్తిచేయడానికి ప్రాథమిక గెజిట్ నుంచి 3(స్మాల్ ఏ), 3(క్యాపిటల్ ఏ), 3(డీ), 3(జీ), 3(హెచ్) వరకు గెజిట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ క్యాపిటల్ ఏ వద్దనే ఆగిపోయింది. కేంద్రం స్మాల్ (ఏ) గెజిట్ను విడుదల చేయడానికి కంటే ముందే.. జాతీయ రహదారుల సంస ్థఅభ్యర్థన మేరకు సత్వర భూసేకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం గత మార్చిలోనే ఎనిమిది భూసేకరణ యూనిట్లను ఏర్పాటుచేసింది. వీటిని ఆమోదిస్తూ కేంద్రం స్మాల్ (ఏ) గెజిట్లో పొందుపరిచింది.
భూ సేకరణకు అయ్యే ఖర్చులో సగం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్రానికి తెలియజేశారు. ఇలా ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ, గెజిట్లు విడుదలలో కేంద్రం కాలయాపన చేస్తున్నది. మార్చి చివరలో స్మాల్ (ఏ) గెజిట్ విడుదలైన తరువాత ఏప్రిల్ 18న యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్, జోగిపేట-ఆంధోల్ ఆర్డీవో నేతృత్వంలో ఏర్పాటైన భూసేకరణ యూనిట్ల పరిధిలో భూసేరణకు రెండు క్యాపిటల్ (ఏ) గెజిట్లను మాత్రమే విడుదల చేసింది. ఇంకా ఆరు క్యాపిటల్ (ఏ) గెజిట్లను విడుదల చేయాల్సి ఉన్నది.
ఆ తరువాతనే గెజిట్ (సీ)ని విడుదల చేసి, భూమికి అవార్డు ఇచ్చి స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. భూమిని కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. డీపీఆర్లో అన్ని విషయాలు వివరించినప్పటికీ జంక్షన్లపై స్పష్టత రాలేదంటూ గెజిట్లను విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే గెజిట్ల విడుదలలో జాప్యం చేస్తున్నదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 15న జాతీయ రహదారుల సంస్థ జాతీయ కార్యనిర్వాహక సమావేశం జరగనున్న నేపథ్యంలోనైనా గెజిట్లకు మోక్షం లభిస్తుందో, లేదో చూడాలి.