హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఏర్పాటు చేసింది. గురువారం టీ-హబ్లో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ ప్రారంభించారు. దేశంలోనే స్టార్టప్లకు అత్యంత అనుకూలమైన వాతావరణం రాష్ట్రంలో ఉందని గుర్తించిన తర్వాతే సీఐఐ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలిపారు. దేశవ్యాప్తంగా పరిశ్రమలకు కేంద్ర బిందువుగా ఉన్న సీఐఐ.. టీ-హబ్ ప్రాంగణంలో తమ స్టార్టప్ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయడం తెలంగాణకే గర్వకారణమన్నారు. దీనివల్ల స్థానిక స్టార్టప్ వ్యవస్థాపకులకు ఎంతో మేలు జరుగుతుందన్న విశ్వాసాన్ని కనబర్చారు. ఈ క్రమంలోనే పరిశ్రమలతో స్టార్టప్లు నేరుగా అనుసంధానమయ్యేందుకు దీన్నో మంచి వేదికగా అభిప్రాయపడ్డారు. ఇప్పుడు స్టార్టప్లకు అవసరమైన పెట్టుబడులు పెద్ద మొత్తంలోనే సమకూరేందుకు అవకాశాలుంటున్నాయని, పైగా కంపెనీలతో నెట్వర్క్ పెరగడం వల్ల దేశ, విదేశాల్లో స్టార్టప్ల కార్యకలాపాలు, మార్కెటింగ్ సులువవుతున్నదన్నారు.
స్టార్టప్ల సరికొత్త ఆవిష్కరణలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు టీ-హబ్లోని 6వ అంతస్తులో 15వేల చదరపు అడుగుల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ప్రారంభించామని సీఐఐ సీఐఈఎస్ చైర్మన్, యాక్సిలర్ వెంచర్స్ చైర్మన్ క్రిస్ గోపాల కృష్ణన్ తెలిపారు. వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునేవారికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ దన్నుగా ఉంటుందన్నారు. స్టార్టప్లకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా టీ-హబ్ ఉండటంతో ఇక్కడే విశాలమైన స్థలంలో ఒకేసారి 200 మంది కూర్చుని పనులు చేసుకునేలా ఈ కేంద్రాన్ని ప్రారంభించామని తెలియజేశారు. ఆకట్టుకునే ఆలోచనలతో వచ్చేవారిని ప్రోత్సహించేందుకు ఇదొక వేదికగా ఉండటమే కాకుండా, వివిధ రకాల పరిశ్రమలతో నెట్వర్కింగ్, నిధులను సమకూర్చుకునేందుకూ అవకాశం లభించగలదన్న ధీమాను ఆయన వెలిబుచ్చారు.
సెంటర్ ప్రారంభమైన తొలిరోజే 14 కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదరడం విశేషం. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు తమ వంతు సహాయ సహకారాలను ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ద్వారానే సదరు కార్పొరేట్లు అందిస్తారని క్రిస్ చెప్పారు. కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గ్యారెత్ విన్ ఓవెన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కోఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా, సీఐఐ స్టార్టప్ప్రెన్యూర్ అవార్డ్స్-2022 చైర్మన్, కెవిన్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ సికె రంగనాథన్, వోల్పో గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమల్బాలి, టీ-హబ్ సీఈవో ఎంఎస్ రావు, పలువురు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అధ్యక్షతన టీ హబ్లో జరిగిన కార్యక్రమంలో రోబోటిక్స్ ప్రాధాన్యత, ముసాయిదాపై ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ను ఏర్పాటు చేసి..వాటి అభివృద్ధి, వినియోగాన్ని విసృతం చేసేందుకుగాను ప్రత్యేకంగా పాలసీలు, ప్రేమ్ వర్క్లను రూపొందిస్తున్నది.