హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): జాతీయ రహదారుల మంజూరులో తెలంగాణపై ఎనిమిదేండ్లుగా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ ఏర్పడిన తరువాత 3,663 కిలోమీటర్ల పొడవున్న 29 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడానికి కేంద్రం అంగీకరించింది. 2014 నుంచి ఇప్పటి వరకు 2,525 కిలోమీటర్లను మాత్రమే జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేసింది. మరో 1,138 కిలోమీటర్ల రోడ్డును మంజూరు చేయాల్సి ఉన్నది.
ఈ 1,138 కిలోమీటర్ల రహదారుల్లో సరుకు, ప్రజా రవాణా కోసం అత్యవసరంగా 541 కిలోమీటర్ల పొడవున్న 5 రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి నిధులు మంజూరుచేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నప్పటికీ స్పందన లేదు. ఈ 514 కిలోమీటర్లలో 182 కిలోమీటర్ల దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డు కూడా ఉన్నది. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 50 శాతం ఖర్చు భరిస్తామని.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినప్పటికీ కేంద్రం ముందడుగు వేయడం లేదు. ఇప్పటికే మంజూరైన ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అయ్యే భూసేకరణ ఖర్చులో సగం రాష్ట్రమే భరిస్తున్నది.
158 కిలోమీటర్ల ఉత్తర భాగం పనులు సంగారెడ్డి నుంచి గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు త్వరలో మొదలుపెట్టనున్నారు. రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం పూర్తయితేనే ఈ రహదారులను సమర్థంగా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. దక్షిణ భాగం పూర్తయితే హైదరాబాద్కు వెళ్లకుండా ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణకు, తూర్పు తెలంగాణ నుంచి పశ్చిమ తెలంగాణకు వెళ్లడానికి వీలవుతుంది. నాలుగు వైపులా హైదరాబాద్తో సంబంధం లేకుండా రాకపోకలు సాగించడమే రీజినల్ రింగ్ రోడ్ లక్ష్యం. 541 కిలో మీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా వెంటనే అప్గ్రేడ్ చేయాలని ఇటీవల హైదరాబాద్కు వచ్చిన కేంద్రమంత్రి గడ్కరీని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కోరారు.
సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(సీఆర్ఐఎఫ్) నిధులు మంజూరు చేసిన మేరకు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదు. ఈ ఏడాది రాష్ట్రంలో 48 రహదారుల పనుల కోసం రూ.878 కోట్లు మంజూరు చేసింది. కానీ రూ.260 కోట్లే విడుదల చేసింది. దీంతో పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. ఈ నిధుల కింద ఏటా రూ.500 కోట్లయినా కనీసం ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరుతున్నది. ఈ విషయంలో సైతం చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.