హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29(నమస్తే తెలంగాణ): అంతరించిపోతున్న నక్షత్ర తాబేళ్ల పరిరక్షణకు సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధనలు చేస్తున్నది. దక్షిణ భారత్, శ్రీలంకలో నక్షత్ర తాబేళ్ల సంతతి ఎక్కువగా ఉంటుంది. నక్షత్ర తాబేళ్ల మాంసానికి అమెరికా, యూరప్ దేశాల్లో డిమాండ్ ఉన్నది. దీంతో వీటిని తెలుగు రాష్ర్టాలతోపాటు దక్షిణ భారత్ నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. వీటి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. 2003లో కంటైనర్లో సింగపూర్కు తరలిస్తున్న దాదాపు 1,800 నక్షత్ర తాబేళ్లు పట్టుబడటంతో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అప్పటినుంచి తాబేళ్ల అక్రమ తరలింపును నియంత్రించడంతోపాటు సంతతిని పెంచేందుకు సీసీఎంబీ కృషి చేస్తున్నది. అక్రమ తరలింపుల్లో భాగంగా పట్టుబడిన నక్షత్ర తాబేళ్లను మైక్రో శాటిలైట్ విధానంలో నిత్యం పరిరక్షించేలా చర్యలు చేపట్టింది. నక్షత్ర తాబేళ్ల డీఎన్ఏను సేకరించి వాటి సంతతి వృద్ధికి కృషి చేస్తున్నది.
బలమైన జన్యు నిర్మాణం
సింగపూర్కు తరలిస్తూ పట్టుబడిన నక్షత్ర తాబేళ్ల జన్యు పరిణామ క్రమాన్ని గుర్తించిన సీసీఎంబీ.. ఇతర దేశాల్లోనక్షత్ర తాబేళ్ల కంటే భిన్నమైన, బలమైన జన్యు నిర్మాణం ఉన్నదని తేల్చింది. దక్షిణ భారత్, శ్రీలంకలో దొరికిన తాబేళ్లలోనే జన్యుక్రమం వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించింది. అప్పటి నుంచి డీఎన్ఏ ఆధారిత పరీక్షల ద్వారా నక్షత్ర తాబేళ్లను సంబంధిత ప్రాంతాలకు తిరిగి తరలించి, జీవావరణం పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నది.