హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ ఆర్వీకే పాఠశాల ప్రాంగణంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మార్చి 1వరకు అఖిల భారత సభలు జరుగనున్నాయని బీకేఎస్ నేత, సీసీఎంబీ విశ్రాంత ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవీరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూడ్రోజులపాటు జరుగనున్న ఈ సదస్సును భారతీయ కిసాన్సంఘ్ అధ్యక్షుడు కే సాయిరెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా, కార్యదర్శి దినేశ్ కులకర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ముదుగంటి శ్రీధర్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జోగినపల్లి శ్రీరంగారావు, ప్రధాన కార్యదర్శి అంబీర్ ఆనందరావు, కోశాధికారి లింగనోళ్ల మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలోని వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వెయ్యిమంది భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు కూడా మహాసభలకు హాజరవుతారని ఆయన తెలిపారు.