హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కాం గ్రెస్ నేతలు ఏఐసీసీ కార్యదర్శులు పీ విష్ణువర్ధన్, మన్సూర్అలీఖాన్పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2023 నవంబరు 22న కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో విష్ణువర్ధన్, మన్సూర్అలీఖాన్ కూడా పాల్గొన్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సికింద్రాబాద్ కోర్టులో 2024లో అభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ విష్ణువర్దన్, మన్సూర్అలీఖాన్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే సుజన విచారణ చేపట్టారు. సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు.