న్యూఢిల్లీ : టిక్రీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాను నిరసిస్తూ గత కొంతకాలంగా ఢిల్లీ సరిహద్దుల్ని పలు ప్రాంతాల్లో రైతులు గత 101 రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసింది. వంద రోజులు దాటినా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న నిరాశతో రైతు ఆత్మహత్య చేసుకుని కేంద్రాన్ని ఉద్దేశించి ఒక లేఖ రాసినట్లుగా తెలుస్తున్నది.
ఆదివారం ఉదయం ఆందోళన చేస్తున్న వేదికకు 7 కిలోమీటర్ల దూరంలోని ఓ చెట్టుకు ఓ రైతు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని హర్యానాలోని హిస్సార్ జిల్లాకు చెందిన రాజ్బీర్ (49) గా గుర్తించారు. రైతు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బహదూర్గఢ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్కుమార్ ధ్రువీకరించారు. మృతుడు గత కొంతకాలంగా తోటి రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొంటున్నాడు. ఉద్యమం వంద రోజులు పూర్తయినా కేంద్రం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనై వేదికకు సమీపంలోని ఓ చెట్టుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాల కారణంగానే తానీ అడుగు వేయాల్సి వచ్చిందని, తన చివరి కోరికగా ఆ మూడు చట్టాలను విరమించుకుని రైతులకు మేలు చేయాలని తన సూసైడ్నోట్ లో రాజ్బీర్ పేర్కొన్నాడు. గత నెలలో కూడా హర్యానాకు చెందిన ఇదే టిక్రీ సరిహద్దు వద్ద చెట్టుకు ఉరేసుకుని బలవంతంగా ప్రాణాలు వదిలాడు. మరో రైతు కూడా విషం తీసుకోగా.. చికిత్స నిమిత్తం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. కాగా, గత ఏడాది డిసెంబర్ నెలలో రోజుల వ్యవధిలో ఇద్దరు రైతులు ఇదే మాదిరిగా ప్రాణాలు విడిచారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల మంచిని కోరి తాము తీసుకొచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని టిక్రీలో ఆందోళన చేస్తున్న రైతులు ముక్తకంఠంతో నినదించారు.