హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా సోమ వారం సాయంత్రం 5 గంటలకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బహిరంగ ప్రచారానికి గడువు ముగిసింది. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019 సెక్షన్ 209 ప్రకారం.. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముం దే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుం దని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి జీ లింగ్యానాయక్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. అతిక్రమిస్తే 209 (2) ప్రకారం రెండేండ్ల జైలుశిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధిస్తారని హెచ్చరించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఎలక్ట్రానిక్ మీడియా మేనేజర్లు నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. టీవీలు, సినిమాలు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఎన్నికల అంశాలను ప్రదర్శించడం నిషేధమని, సంగీత కచేరీలు, నాటకాలు, ప్రజలను ఆకర్షించే ఎలాంటి వినోద కార్యక్రమాల ద్వారా ఎన్నికల ప్రచారం చేయకూడదని సూచించారు. ఫోన్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా చేసే ప్రచారం కూడా సెక్షన్ 209(1)(బీ) కిందికే వస్తుందని, వీటిపై నిఘా ఉం టుందని ఎస్ఈసీ కార్యదర్శి స్పష్టం చేశారు. ఆన్లైన్ వేదికలపై నిఘాకు బృందాలు రంగంలోకి దిగాయి.