తెలంగాణలో పెట్టుబడుల వరదపారించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలతో విజయవంతంగా చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు సోమవారం కెమ్ వేద ఫార్మస్యూటికల్ కంపెనీ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, 3.2బిలియన్ల డాలర్ల వార్షిక రెవెన్యూ గల ప్రపంచ ప్రఖ్యాత కాల్అవే గోల్ఫ్ కంపెనీ హైదరాబాద్లో డిజిటెక్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్తో ఆ కంపెనీ ప్రముఖులు మంగళవారం చర్చలు జరిపారు. అనంతరం ఈ ప్రకటనను విడుదల చేశారు.
హైదరాబాద్లో ఏర్పాటుచేయనున్న డిజిటెక్ సెంటర్లో 300 మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కు ఉపాధి లభించనుంది. ఈ కేంద్రం డేటా అనలిటిక్స్తోపాటు ఆ కంపెనీ గ్లోబల్ ఆపరేషన్స్కు ఐటీ బ్యాకెండ్ సపోర్ట్ను అందించనుంది. కాగా, ఈ సమావేశంలో తెలంగాణలో స్పోర్ట్స్ టూరిజం, తయారీలాంటి ఇతర సహకార అవకాశాలపై చర్చించారు. డిజిటెక్ సెంటర్ ఏర్పాటుకోసం దేశంలోని వివిధ నగరాలను పరిశీలించిన కాల్అవే కంపెనీ, చివరగా హైదరాబాద్ను ఎంచుకోవడం విశేషం.