హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం బ్యాక్ వాటర్లోని సోమశిల ప్రాజెక్టుకు మరింత అందాన్ని తీసుకొచ్చేలా కేబుల్ వంతెనను రోడ్లు, భవనాలశాఖ నిర్మించనున్నది. జడ్చర్ల నుంచి కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు నిర్మించే జాతీయ రహదారిలో భాగంగా కొల్లాపూర్-ఆత్మకూరు మధ్య సోమశిల వద్ద కృష్ణానదిపై రెండు గుట్టల మధ్య కిలోమీటర్ పొడవుతో ఈ కేబుల్ వంతెనను నిర్మించాలని నిర్ణయించింది. నాలుగు లేన్ల రహదారిగా నిర్మించే ఈ బ్రిడ్జిపై భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగించేలా, దాని దిగువన పర్యాటకులు నడిచేలా గ్లాస్ వంతెనను నిర్మిస్తారు. ఈ మేరకు అధికారులు బ్రిడ్జి నమూనాను ఫైనల్ చేశారు. ఈ కేబుల్ వంతెన నిర్మాణానికి రూ.800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను జాతీయ రహదారుల సంస్థకు పంపనున్నారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో నల్లమల్ల అటవీ ప్రాంతానికి సరిహద్దున ఉండే కృష్ణా పరీవాహక ప్రాంతానికి మరింత శోభ రానున్నది.
కేబుల్ బ్రిడ్జి నిర్మాణం ఇలా..