Suicide | హైదరాబాద్ : జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యాపారి హైదరాబాద్ నగరంలో సూసైడ్ చేసుకున్నాడు. తన వద్ద పని చేసే ప్రతాప్ అనే వ్యక్తి మోసం చేయడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సబ్బాని నరేశ్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన సబ్బాని నరేశ్.. కథలాపూర్ మండలంలో గత కొన్నేండ్ల నుంచి హీరో షోరూం నిర్వహిస్తున్నాడు. నరేశ్ వద్ద ప్రతాప్ అనే వ్యక్తి ఐదారేండ్ల నుంచి పని చేస్తున్నాడు. ఇక ఇద్దరి మధ్య మంచి బంధం బలపడటంతో.. భవానీ ఎంటర్ప్రైజెస్ పేరుతో వాహనాల లక్కీ డ్రా ప్రారంభిద్దామని నరేశ్కు ప్రతాప్ సూచించాడు. దీంతో ఇద్దరూ కలిసి లక్కీ డ్రా స్కీమ్ను ప్రారంభించారు. ఈ స్కీం కొన్నాళ్ల పాటు వరకు బాగానే సాగింది. కానీ ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే నరేశ్ హైదరాబాద్కు వచ్చి సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
నరేశ్ ఆత్మహత్య చేసుకునే ముందు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. లక్కీ డ్రా స్కీమ్ పేరిట ప్రతాప్ కస్టమర్ల నుంచి దాదాపు రూ. కోటి 90 లక్షలు వసూలు చేసి, వారికి బైక్లు ఇవ్వకుండా మోసానికి పాల్పడి, తనను ఇబ్బందులకు గురి చేశాడని నరేశ్ తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.
‘నేను షోరూమ్లో బైక్స్ స్కీమ్ చేశాను. ప్రతాప్ అనే వ్యక్తిని కలుపుకొని ఆరు స్కీమ్లు చేశాము. రెండు స్కీమ్లు క్లియర్ అయిపోయాయి. తర్వాత ప్రతాప్కు పూర్తి ఇంచార్జి బాధ్యతలు ఇచ్చాను. ఆ తర్వాత అతడి పేరుపై బ్యాంకు ఖాతా కూడా తెరిచాను. నా పేరుపై ఉంటే అతడి పేరుపై తీయించుకున్నాడు. నేను కూడా దీనికి అంగీకరించి.. కోరుట్ల హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ప్రతాప్ పేరుపై కరెంట్ ఖాతా ఓపెన్ చేయించా. మిగతా నాలుగు స్కీమ్లకు సంబంధించి.. నేను ఇప్పటి వరకూ 350 వెహికిల్స్ను స్కీమ్ ద్వారా ఇచ్చాను. 350 వెహికిల్స్కు సంబంధించి.. ఆఫ్లైన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ప్రతాప్ కొంత డబ్బు నాకు ఇచ్చాడు. మిగతా డబ్బులు ప్రతి నెల వస్తాయని అనుకుని.. నేను కూడా ఏమీ అనలేదు. డబ్బుల గురించి కూడా ప్రతాప్ను చాలాసార్లు అడిగాను. డబ్బులు ఎక్కడా పోవు అని సమాధానం ఇచ్చేవాడు. డబ్బులు వసూలు చేసి, ఇస్తానని చెప్పాడు. ఐదారేండ్లుగా నా వద్ద నమ్మకంగా పని చేస్తున్నందున అతడిని పూర్తిగా నమ్మాను. నేను నమ్మినందుకు తగిన గుణపాఠం చెప్పాడు. నాకు జీవితం అనేది లేకుండా చేశాడు. ఈ లోటును ముందే గుర్తించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. స్కీమ్లు పూర్తయ్యే సమయం వచ్చింది. అందరికీ సెటిల్మెంట్ చేసే సమయం అది. మళ్లీ డబ్బుల గురించి ప్రతాప్ను అడిగాను. డబ్బులు వస్తాయి.. చివరిదాక మనకు టెన్షన్ ఉండదు అని చెప్పాడు. నేను కూడా అదే నమ్మకంతో ఉన్నాను. తర్వాత స్కీమ్ దగ్గరకు వచ్చింది. రెండు నెలల సమయం ఉంది. మరోసారి కూడా ప్రతాప్ను డబ్బుల గురించి అడిగాను. అప్పుడు కొన్ని రోజులు సమయం తీసుకుని.. ఒక స్కీమ్ 62 లక్షలు ఇచ్చేది ఉందని చెప్పాడు’ అంటూ నరేశ్ తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.