హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించి, వారి ఆదాయాన్ని పెంచి, తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజా ప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికొదిలేసి, ప్రజలను పీల్చి పిప్పిచేస్తూ.. అడ్డగోలుగా పన్నులు వేస్తూ వాటిని ముక్కుపిండి వసూలు చేసుకోవడం మోదీ విధానం. తెలంగాణ సర్కారు మొదటి విధానాన్ని అవలంబిస్తుంటే.. కేంద్రం రెండో విధానాన్ని అనుసరిస్తున్నది. జీఎస్టీ పేరుతో పేదోడి నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్.. చివరికి దేశానికి అన్నం పెట్టే అన్నదాతను సైతం వదలడం లేదు. సూక్ష్మ సేద్యానికి ఉపయోగించే పరికరాలపై కేంద్రం 12 శాతం జీఎస్టీ విధిస్తున్నది. దీంతో సూక్ష్మ సేద్యం చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు. సూక్ష్మం సేద్యం చేయాలన్న ఆసక్తితో చాలామంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే జీఎస్టీ భారం ఉందని తెలియడంతో వారు వెనుకడుగు వేస్తున్నారు.
సూక్ష్మ వ్యవసాయం ఎంతో వ్యయంతో కూడుకున్నది. సూక్ష్మ వ్యవసాయానికి అవసరమయ్యే పరికరాలన్నింటినీ ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. బీసీలకైతే 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నది. ఎకరం స్థలంలో సూక్ష్మ సేద్యం చేయాలంటే దాదాపు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతున్నది. దీనిపై కేంద్రానికి 12 శాతం జీఎస్టీ చెల్లించాలి. సూక్ష్మ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీలకు, ఇతరులకు సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నా.. వాటిపై జీఎస్టీని మాత్రం రైతులే చెల్లించాల్సి వస్తున్నది. నాలుగెకరాలున్న రైతు సూక్ష్మ సేద్యం కోసం జీఎస్టీ రూపంలో రూ.12 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుం ది. దీంతో చాలామంది రైతులు సూక్ష్మసేద్యం పట్ల నిరాసక్తత కనబరుస్తున్నారు.
ఆయిల్పామ్ సాగులో సూక్ష్మసేద్య పరికరాలది కీలక పాత్ర. ఆయిల్పామ్ సాగును 20 లక్షల ఎకరాలకు విస్తరించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. కానీ జీఎస్టీ కారణంగా రైతులు ఆయిల్పామ్ సాగు పట్ల వెనుకడుగు వేస్తున్నారు. సూక్ష్మసేద్యం మంజూరైన చోట్లలో కూడా రైతులు జీఎస్టీ భారం భరించలేక, ఆ సొమ్ము చెల్లించకపోవడంతో అవి నిలిచిపోయాయి.