ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య
హాలియా, సెప్టెంబర్ 6 : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో 250 ఎకరాల్లో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుద్ధవనం ప్రాజెక్ట్ను సుందర నందన వనంగా తీర్చిదిద్దామని ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. బుద్ధవనం ప్రాజెక్ట్ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మల్లేపల్లి మాట్లాడుతూ.. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించే విధంగా బుద్ధవనానికి తుది మెరుగులు దిద్దుతున్నట్టు వెల్లడించారు. తెలంగాణ బౌద్ధ వారసత్వాన్ని, తెలుగు రాష్ర్టాల్లోని బౌద్ధ కట్టడాలను, బుద్ధుడి జీవిత చరిత్రకు సంబంధించిన జాతక కథలను, బౌద్ధ చరిత్ర, బౌద్ధ పునరుజ్జీవ చరిత్రలను పర్యాటకులకు వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బుద్ధవనం ప్రధాన ముఖద్వారం, మహాస్తూపం పైన అలంకరించిన బౌద్ధ శిలాఫలకాల వివరాలను బౌద్ధ పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఎస్ఈ క్రాంతిబాబు, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, డిజైన్ ఇన్చార్జి శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.