CM KCR | ప్రశ్నించడంతో పాటు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్లాంటి భావజాలం ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో భారత్ను వెలుగుజిలుగుల దేశంగా తయారు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం సభలో కేంద్రం అవలంభిస్తున్న విధానాలను తూర్పారబాట్టారు. రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలను పరిష్కరించడంలో విఫలమైందని దుయ్యబట్టిన కేసీఆర్, రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ‘రష్యాలో అంగారా నదిపై 5968 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. ఘనాలో 5085 టీఎంసీల ప్రాజెక్టు ఉంది.
కెనడాలో 4944 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. ఈజిప్ట్లో నైలునదిపై 4500 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. పొరుగు దేశం చైనాలో యాంగ్జీ నదిపై 1400 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. అమెరికాలోని కొలరాడోలో 1200 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. సువిశాల దేశం ఒక్క ప్రాజెక్టు వద్దా ? మంచినీళ్లకు బాధపడుదామా? సరైన పరిపాలన వచ్చి నదుల నీళ్లు భూమి మీదకు వచ్చి ప్రజల, పొలాల దాహం తీర్చాలా. సన్నాసుల్లా ఇట్లనే ఉండాలా? అని కోరుతున్న. ఇది ప్రశ్నించడానికి, చైతన్యం తేవడానికి పుట్టిందే బీఆర్ఎస్. ఖచ్చితంగా ఆరునైరా తెలంగాణ ఉద్యమం తరహాలో భారతదేశంలో ఉద్యమం తెచ్చేందుకు పోరాటం. బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచాలా? వాటిపై సినిమాలు వచ్చినా మనకు సిగ్గు రాదా?’ అంటూ ధ్వజమెత్తారు.
‘సట్లెజ్ ఉప నదులపై పంజాబ్, హర్యానా తన్నుకుంటయ్. మహానది నీళ్ల కోసం ఒడిశా, ఛత్తీస్గఢ్.. నర్మద జలాల కోసం గుజరాత్, మధ్యప్రదేశ్ కొట్లాట, కావేరి జలాల కోసం తమిళనాడు, కర్నాట కొట్లాట.. గోదావరి నదుల మీద మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రాల పంచాయితీ. చాటలో తవుడు పోసి కుక్కలకు కోట్లాట పెట్టినట్లు రాష్ట్రాల మీద తాకులాట పెడుతున్నరు. చేతగాక పరిపాలన చేయరాక, చట్ట స్ఫూర్తి తేక.. సహజంగా, అప్పు అవసరం లేని బ్రహ్మాండంగా సహజ సంపదను వినియోగించే తెలివి లేక, డొల్ల మాటలు చెప్పే పరిపాలకులు కావాలా? పొద్దుపుచ్చే పరిపాలకులు కావాలా? నిజాయితీగా పనిచేసే వారు కావాలా? మన కాళేశ్వరం కాలేదా? పాలమూరు అవుతలేదా? సీతారామ ఖమ్మంలో పరుగులు పెడుతలేదా? అనవసరంగా పడుతున్న, పెడుతున్న కష్టాల నుంచి భారత జాతిని విముక్తి చేసేందుకే బీఆర్ఎస్. వేరే ఉద్దేశం లేదు. ఈ దుర్మార్గానికి కారణభూతులు కాంగ్రెస్, బీజేపీ. రెండు రెండే. కాంగ్రెస్ ఉంటే బీజేపీ, బీజేపీ ఉంటే కాంగ్రెస్ను తిట్టడం. ఈ తిట్ల పురాణమా కావాల్సింది? మన గొంతులు తడవాలా? పొలాలు పండాలా? దయచేసి ఆలోచించాలి’ అని పిలుపునిచ్చారు.
‘దేశంలో అందుబాటులో ఉన్న కరెంటు 4లక్షల మెగావాట్లు. ఈ దేశం ఎన్నడూ 2.10లక్షల మెగావాట్లకు మించి వాడలే. ఒక్క తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు ఇచ్చేది లేదు. ఏడేళ్ల కింద మన గతి ఏమి ఉండేది. బీఆర్ఎస్లాంటి భావజాలం ఉన్న పార్టీ అధికారంలోకి రెండేళ్లలో వెలుగుజిలుగుల భారతదేశాన్ని తయారు చేస్తాం. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వమంటే దానిపై 96కథలు. దోపిడీదారులు అన్నట్లు, రేవ్డీ కల్చర్ అనీ, ఉచితాలు అని పేర్లు పెట్టి దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానిస్తున్నారు. వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు సిగ్గుపడాలి.
ఇంత సంపద, ఇంత భూమి ఉన్న దేశంలో రైతుల తమ సమస్యల కోసం 13 నెలలు ఢిల్లీలో రాజధానిలో ఆందోళన చేసే దుస్థితా?. ఇదేనా దేశాన్ని పాలించే విధానం. ఇదేనా మోసం.. దగా..? వాళ్లకు ఇష్టమున్న వారికి 13,14 లక్షల కోట్లు ఎన్పీఏల పేరుతో పెట్టుబడిదారులకు దోచిపెట్టారు. దేశమంతా తెలంగాణలో ఇస్తున్నట్లుగా ఉచిత కరెంటు ఇవ్వాలి. దీనికయ్యే ఖర్చు లక్షా 45 వేల కోట్లు మాత్రమే. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రతిపాదించే ప్రభుత్వం వస్తే భారతదేశం మొత్తానికి తెలంగాణ మోడల్ మాదిగా దేశమంతా ఉచిత విద్యుత్ అందిస్తాం. తెలంగాణ రైతుబంధు లాంటి స్కీమ్ భారతదేశమంతా అమలు చేయాలనేదే బీఆర్ఎస్ నినాదం, డిమాండ్’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.