హైదరాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ మన మనిషి కాదు.. మారిన మనిషి.. మర మనిషి’ అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కేసీఆర్ మర మనిషి కాదు.. మట్టి వాసన తెలిసిన మానవతావాది.. మడమ తిప్పని మహోన్నత శక్తి అని ఆదివారం ఎక్స్ వేదికగా తిప్పికొట్టారు. తెలంగాణ గడ్డ విముక్తి కోసం ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణాలను పణంగా పెట్టి చరిత్రనే మార్చిన త్యాగశీలి కేసీఆర్ అని స్పష్టంచేశారు.
అధికారం కోసం బంధాలను బలిపెడతారా?: తుల ఉమ
అధికార దాహం కోసం ఆత్మీయ బంధాలు, ఉద్యమ ఆశయాలను బలిపెడతారా? అని కవితను ఉద్దేశించి జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ప్రశ్నించారు. కేసీఆర్పై కవిత చేసిన వ్యాఖ్యలను ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. రాజకీయాల్లో విభేదాలు ఉండటం సహజమని, కానీ వ్యక్తిగత స్వార్థం కోసం కన్న తండ్రిని, ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించిన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడటం దురదృష్ట కరమని మండిపడ్డారు. ‘కేసీఆర్ బిడ్డవు కాకుంటే నువ్వు ఎవరు? నీ గురించి ఎవరికీ తెలుసు? నీకు గుర్తింపు ఎక్కడిది? అని ప్రశ్నలవర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పేరిట ప్రజలను మోసం చేయాలని చూస్తే ఎవరూ నమ్మరని, అది ‘తెలంగాణ రేవంత్రెడ్డి సేన’ అనే విషయం అందరికీ తెలుసని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాలు, స్వలాభం కోసం పెట్టిన పార్టీని ప్రజలు ఆదరించరని స్పష్టంచేశారు. కేసీఆర్ పాలనలో పదవులు అనుభవించి ఇప్పుడు బయటకు వెళ్లి నిందలు వేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.