మెదక్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం గ్రామీణ రోడ్లు మరమ్మతులు చేయకపోవడంతో గుంతలు పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ ్ట అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. సోమవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం నుంచి శెట్టిపల్లి కలాన్ వరకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పాదయాత్ర నిర్వహించగా, మద్దతుగా పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెల్దుర్తి నుంచి మెదక్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేసేందుకు రూ. 18 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నిధులు రద్దు చేసిందని ఆరోపించారు. వెల్దుర్తి- మెదక్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు సునీతారెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, యాదవ్రెడ్డి నాయకులు, కార్యకర్తలతో చేరుకోగా మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోకి అనుమతి లేదని పోలీసులు తెలుపడంతో బీఆర్ఎస్ నాయకులు గేట్ ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారు. డీఆర్వోను కలిసి వెల్దుర్తి -మెదక్ రోడ్డును బీటి రోడ్డుగా నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.