తమ స్వార్థ రాజకీయాల కోసం కడియం శ్రీహరి, కే కేశవరావు రంగులు మార్చుతున్నారని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ అన్నారు. దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలిచి చూపించాలని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ పదవీ లేకుండా ఇంట్లో ఉన్న కడియం శ్రీహరిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరకు తీసి ఉపముఖ్యమంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అవకాశమిచ్చి ఉన్నత స్థాయికి తెచ్చారని అన్నారు. కేశవరావును కాంగ్రెస్ ఛీకొడితే కేసీఆర్ అక్కున చేర్చుకుని పార్టీ సెక్రటరీ జనరల్గా, రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చారని గుర్తుచేశారు. అధికారం కోసం తిరిగి కాంగ్రెస్ పంచన చేరుతున్న వీళ్లు మేక తోలు కప్పుకున్న తోడేళ్ళని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో చావుదెబ్బ తిని చరిత్ర హీనులుగా మారుతారని జోష్యం చెప్పారు. వీరిని చూసి ఊసరవెళ్లి సైతం సిగ్గుపడుతోందని ఎద్దేవా చేశారు.
బీజేపీ, కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువవడంతోనే బీఆర్ఎస్ నాయకులను లాక్కుంటున్నారని సుంకె రవిశంకర్ విమర్శించారు. ఇన్నాళ్లూ అధికారం అనుభవించి ఏ మాత్రం సిగ్గు, లజ్జ లేకుండా ఇతర పార్టీల్లోకి పోతున్న వారి గురించి తెలంగాణ సమాజం ఆలోచించాలని పిలుపునిచ్చారు. గుంపు మేస్త్రీ ఇక నీ పని ఖతమేనంటూ సీఎం రేవంత్నుద్దేశించి కడియం చేసిన వ్యాఖ్యలు మరిచి కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్లో చేరడం ఆయనకున్న నైతిక విలువలు తేటతెల్లమవుతున్నాయని ఎద్దేవా చేశారు. వీరిద్దరికీ ఆస్కార్ అవార్డులు ఇవ్వొచ్చని వ్యంగ్యాస్ర్తాలు విసిరారు. తెచ్చుకున్న తెలంగాణను తిరిగి ఆంధ్రాలో కలిపే కుట్రలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. తన శిష్యుడు రేవంత్రెడ్డితో ఇటీవల బేగంపేట ఎయిర్పోర్టులో రెండు గంటలపాటు చంద్రబాబు సమావేశమవడం ఈ అనుమానాలకు ఊతమిస్తోందని తెలిపారు. అడ్రస్ తెలవని కడియం కూతురికి కేసీఆర్ పిలిచి టికెట్ ఇచ్చారని, కేకే కూతురు హైదరాబాద్ మేయర్గా కొనసాగుతుండడం కేసీఆర్ పెట్టిన భిక్షేనన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీల్లో కొన్నైనా అమలు చేయకపోవడం కాంగ్రెస్ సర్కారు దుర్నీతికి నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తుండడంతో కక్షగట్టి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కార్యకర్తల బలమున్న బీఆర్ఎస్ పార్టీ కొత్త నాయకులను తయారు చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణను దేశానికే రోల్మోడల్గా చేసిన వారిని మాత్రమే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.