హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వీఆర్ఏ కుటుంబాలకు అండగా నిలువాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కు విజ్ఞప్తిచేశారు. తమ కుటుంబాలకు అండగా నిలువాలని కోరారు. గురువారం తెలంగాణ భవన్లో వీఆర్ఏల ప్రతినిధులు ఆర్ఎస్పీని కలిసి తమ సమస్యను వివరించారు. రాష్ట్రంలోని 20,555 మంది వీఆర్ఏలలో 16,758 మందికి మాత్రమే ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిందని, మిగిలిన 3,797 వీఆర్ఏ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వీఆర్ఏలు 80 రోజులపాటు సమ్మె చేసిన సందర్భంగా వారి సమస్యలపై ఐఏఎస్ అధికారుల కమిటీ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయని సంఘం ప్రతినిధులు తెలిపారు. వీఆర్ఏల విద్యార్హతలకు అనుగుణంగా ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో సర్దుబాటు చేసేందుకు అప్పటి ప్రభుత్వం జీవో-81 జారీ చేసిందని, ఇదే జీవో పరిధిలో 3,797 కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి నరసింహులు బోయ, నాయకులు సంగమేశ్వర్, అనిల్, రాకేశ్, విజయ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.