MLC Kavitha | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ తీరు చట్టబద్ధమేనా? న్యాయ సమ్మతమైనదేనా? కోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడే ఉన్నదా? న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉండగానే స్వతంత్రంగా వ్యవహరించిన ఈడీ వైఖరిని న్యాయ కోవిదులు తప్పుబడుతున్నారు. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని అభిప్రాయపడుతున్నారు. సీఆర్పీసీ చట్టాన్ని పట్టించుకోకుండా.. కేసుల విచారణ, అరెస్టుకు సంబంధించి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్-1973 (సీఆర్పీసీ)లో మహిళలకు కొన్ని రక్షణలు కల్పించారు. ఈ నిబంధనలు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులకు కూడా వర్తిస్తాయా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై నళిని చిదంబరం, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ సతీమణి రుజిరా బెనర్జీతో పాటు కవిత కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం ఇప్పటికీ కోర్టు పరిధిలోనే ఉన్నది. అయినప్పటికీ, ఇవేమీ పట్టించుకోని ఈడీ అధికారులు.. కవితను అరెస్టు చేశారు. సూర్యాస్తమయం తర్వాత మహిళను అరెస్టు చేయాల్సివస్తే, స్థానికంగా ఉండే ఫస్ట్క్లాస్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ఆనుమతి తీసుకోవాలని, ట్రాన్సిట్ వారెంట్ (రాష్ట్ర సరిహద్దులను దాటేందుకు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చే ఆదేశాల పత్రం) లేకుండా రాష్ట్రం దాటించకూడదని సీఆర్పీసీ చట్టంలో స్పష్టంగా ఉన్నది. ఈ నిబంధనలను బేఖాతరు చేసిన ఈడీ.. కవితను ఏకపక్షంగా అరెస్టు చేసి ఢిల్లీకి తరలించింది.
సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగానే..
ఢిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు శుక్రవారం పేర్కొన్నది. అయితే, కవిత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఈడీ ఓ ప్రకటన చేసింది. కవితపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోబోమని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు కోర్టులో అండర్టేకింగ్ను (ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోబోము అని రాతపూర్వక హామీ) కూడా సమర్పించింది. అయితే, కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నదన్న విషయాన్ని పక్కనబెట్టిన ఈడీ.. ఢిల్లీ నుంచి ఆగమేఘాలపై హైదరాబాద్కు వచ్చి కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి, అరెస్టు చేసింది.
ఈ ప్రశ్నలకు జవాబేది?
అండర్టేకింగ్ సమర్పించిన తర్వాత ఎలా అరెస్టు చేస్తారని, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీకి ఎలా తరలిస్తారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నించారు. అయితే, సుప్రీంకోర్టుకు ఇచ్చిన అండర్టేకింగ్ని వెనక్కి తీసుకుంటున్నామని ఈడీ అధికారులు బదులివ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈడీ ఇచ్చిన అండర్టేకింగ్ను మళ్లీ అదే ఈడీ వెనక్కి తీసుకోవాలనుకొన్నప్పటికీ, దానికి కోర్టు అనుమతి తప్పనిసరిగా అవసరం ఉంటుందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్రావు పేర్కొన్నారు. దీన్ని ఈడీ పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు.
కోర్టు ధిక్కరణకు భారీ మూల్యం
కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్-1971 ప్రకారం.. కోర్టు ధిక్కరణను రెండు రకాలుగా విభజిస్తారు. మొదటిది సివిల్ కంటెంప్ట్. రెండోది క్రిమినల్ కంటెంప్ట్. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే అనుసరించకపోవడాన్ని సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తారు. ఆదేశాలను పాటించకుండా కోర్టు గౌరవాన్ని దిగజార్చేలా చేయడం, న్యాయ పరిపాలన ప్రక్రియలకు అడ్డు తగలడం వంటివి క్రిమినల్ కంటెంప్ట్ కిందకు వస్తాయి. కోర్టు ధిక్కరణ చర్యకు శిక్షగా ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు. లేదా రూ.2 వేల వరకు జరిమాన విధించవచ్చు. కొన్నిసార్లు రెండు శిక్షలు కూడా వేయొచ్చు. కవిత కేసు విషయంలో ఈడీ అధికారులు సివిల్తో పాటు క్రిమినల్ కంటెంప్ట్కు కూడా పాల్పడినట్టు అర్థమవుతున్నదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.