చౌటుప్పల్, అక్టోబర్ 22: తాము గెలుస్తామన్న నమ్మకం బీజేపీ కార్యకర్తల్లోనే లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. రూ.80 లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికితీస్తానన్న ప్రధాని మోదీ ఎందుకు ఆ పని చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణను సర్వనాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్రెడ్డిపై ప్రజల్లో విముఖత ఉన్నదని తెలిపారు.
కుట్రపూరితంగా ఉప ఎన్నిక తెచ్చి, గెలిచి తెలంగాణలో అధికారం చేజిక్కించుకుందామనే బీజేపీ ఆశలు అడియాశలు కాబోతున్నాయని జోస్యం చెప్పారు. మతాలు కులాల మధ్య చిచ్చులు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, పట్టణ కార్యదర్శి బండారు నరసింహ, నాయకులు నర్సిరెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.