హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఎన్నికలో సానుభూతి కోసం బీజేపీ అనేక నాటకాలు ఆడిందని టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిషాంక్ విమర్శించారు. పోలింగ్నాడు జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఒక బీజేపీ నేత పోలింగ్స్టేషన్ వద్ద మొబైల్ ఫోన్ పట్టుకొని హల్చల్ చేశాడు. ఆ ఫోన్ను ఇవ్వాలని పోలీసులు కోరడంతో దానిని దూరంగా ఉన్న మరో బీజేపీ నేత వైపు విసిరాడు. అతడు ఆ ఫోన్ను తీసుకొని పారిపోయాడు. వెంటనే మొదటి వ్యక్తి ఏడ్చుకుంటూ మహిళా ఓటర్ల వద్దకు పరుగెత్తాడు. పోలీసులు తనను టార్గెట్ చేశారని ఏడ్చాడు. తనంతట తానే కింద పడిపోయి.. పోలీసులు తనను కొట్టారని ప్రచారం చేశాడు. బీజేపీ ఆడిన ఈ డ్రామాను దేశం మొత్తం చూడాలని క్రిషాంక్ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ‘కమల్హసన్ గర్విస్తాడు’ అని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతల నాటకాలపై నెటిజన్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. మీడియా, ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకోవడానికే ఇలాంటి నాటకాలని ఒక నెటిజన్ విమర్శించాడు.
ప్రధానమంత్రిగా చేసిన ప్రమాణాన్ని మోదీ మరిచిపోయినట్టుగా ఉన్నారని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి చురకలేశారు. హిమాచల్ప్రదేశ్లో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే కరోనా వ్యాక్సిన్ చివరి దశలో ఈ రాష్ర్టానికి వచ్చేదని మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. రాజకీయాలకు అతీతంగా ప్రజారోగ్యాన్ని కాపాడ్సాలిన మోదీ.. చివరకు రాజకీయ అంశంగా మార్చేశారని ట్వీట్ చేశారు.