హైదరాబాద్ : దున్నపోతును వెనుక నుంచి కాలితో తంతూ వ్యాన్లోకి ఎక్కిస్తున్న ఒక వీడియోను బీజేపీ నేత జితేందర్రెడ్డి ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఇలాంటి శాస్తే చేయాల్సి ఉన్నది’ అని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడితోపాటు ముఖ్యనేతలందరినీ వరుసబెట్టి తన్నాలంటూ జితేందర్రెడ్డి కోరుకుంటున్నారంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పైగా ఈ ట్వీట్కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కార్యదర్శి సునిల్ బన్సల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ బీజేపీని ట్యాగ్ చేశారు. తన అసంతృప్తిని బాహాటంగా బీజేపీ పెద్దల ముందు ఉంచినట్టు స్పష్టమవుతున్నది.
ఈ ట్వీట్కు ఈటలే కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ఈటల వ్యవహార శైలిపై మొదటి నుంచి జితేందర్రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఈటల రాకతో తనకు ప్రాధాన్యం తగ్గిందని సన్నిహితుల వద్ద చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవలే జితేందర్రెడ్డి ఇంట్లో డీకే అరుణ, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్రెడ్డి వంటి నేతలు సమావేశమై ఈటల వ్యవహార శైలిపైనే చర్చ జరిపినట్టు కథనాలు వెలువడ్డాయి. తాజా ట్వీట్పై జితేందర్రెడ్డి వివరణ ఇస్తూ ‘బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించేవాళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో’ చెప్పానంటూ మరో ట్వీట్ చేశారు. ఇది కూడా ఈటల రాజేందర్ వర్గాన్నే టార్గెట్ చేసినట్టు విశ్లేషకులు చెప్తున్నారు.
ఆధిపత్య పోరుతో నిన్నటిదాకా వాడిపోయిన కమలం.. ఇప్పుడు కలహాలతో కమిలిపోతున్నది. రాష్ట్ర బీజేపీ పరిస్థితి మునిగే టై టానిక్ షిప్లా తయారైంది. నాయకుల మధ్య విభేదాలు ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉండగా.. ఇప్పుడు ‘తన్నుకునే’ స్థాయికి చేరాయి. బీజేపీ నేత జితేందర్రెడ్డి గురువారం ఒక ట్వీట్ బీజేపీ పరిస్థితిని నగ్నంగా సోషల్ మీడియాలో నిలబెట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు ముఖ్యనేతలందరినీ వరుసబెట్టి తన్నాలంటూ అర్థం వచ్చేలా ఒక వీడియోను పోస్ట్ చేశారు. మరోవైపు ఈటలకు వై క్యాటగిరీ భద్రత కల్పించడంతో రఘునందన్రావు మనస్తాపం చెందినట్టు సమాచారం. ఇక ధర్మపురి అర్వింద్ కొన్ని నెలలుగా మౌనం పాటిస్తుంటే.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్లో చేరడానికి ఎదురుచూస్తున్నారు.
నాకూ ఒక పదవి కావాలి?: రఘునందన్
జాతీయ స్థాయిలో తనకూ పదవి కావాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అడుగుతున్నట్టు తెలిసింది. ఈటలతో పోల్చితే తాను సీనియర్ను అని, రాష్ట్రంలో బీజేపీకి ఊపు రా వడానికి తన గెలుపే కారణమని చెప్తున్నట్టు తెలుస్తున్నది. ఈటలకు వై క్యాటగిరీ భద్రతపై అసంతృప్తికి లోనయినట్టు సమాచారం. సు పారీ పేరుతో ఈటల నాటకం ఆడి, భద్రత పెం చుకున్నారని మండిపడుతున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈటల కన్నా తానే ఎక్కువగా విమర్శిస్తున్నానని, తననే టార్గె ట్ చేస్తారని, తనకే రక్షణ కల్పించాలని రఘునందన్రావు కోరుతున్నారు. తనను జాతీయ కమిటీలోకి తీసుకోవాలని, లేదా ఏదేని ఒక పదవి అప్పగించాలని డిమాండ్ చేసినట్టు కొందరు నేతలు తెలిపారు.
పార్టీ సమావేశాలకు అర్వింద్ డుమ్మా
ఎంపీ ధర్మపురి అర్వింద్ కొన్ని నెలలుగా బండి సంజయ్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత డిసెంబర్ నుంచి మౌనంగా ఉంటున్నారు. సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. ‘అధ్యక్ష పదవి అంటే పవర్ సెంటర్ కాదు అదొక బాధ్య త మాత్రమే’ అని విమర్శించారు. మరోనేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తనను పట్టించుకోవడం లేదన్నది ఆయన ఆరోపణ. మంచి ముహూర్తం చూసుకొని కాంగ్రెస్లోకి జంప్ అవుతారని చెప్తున్నారు. వీటిని చక్కదిద్దాల్సిన బండి సంజయ్ చేతులెత్తేసినట్టు స్వయంగా పార్టీ నేతలే చెప్తున్నారు. ఏదో ఒకటి తప్పుగా మాట్లాడటం, వింత చేష్టలు చేయడం, నెటిజన్లకు దొరికిపోవడం బండికి పరిపాటిగా మారింది. ఆయనను ఎద్దేవా చేస్తూ మీమ్లు, కామెంట్లు, పోస్టులతో సోషల్మీడియా హోరెత్తుతున్నది.
తలపట్టుకుంటున్న జాతీయ నాయకత్వం
కాంగ్రెస్ తరహా సంస్కృతికి తెరలేపిన తెలంగాణ బీజేపీని ఎలా చక్కదిద్దాలో తెలియ క ఢిల్లీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర పరిణామాలపై మోదీ నేతృత్వంలో సీనియర్ నేతలంతా బుధవారం అర్ధరాత్రి దాకా చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. వచ్చే వారం ముఖ్యనేతలందరినీ ఢిల్లీకి రమ్మన్నట్టు సమాచారం. దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తుంటే ఓ వైపు కర్ణాటకలో బొక్క బోర్లా పడటం, తెలంగాణలో పార్టీ దీనస్థితికి చేరడంతో ఏం చేయా లో అధిష్ఠానానికి పాలుపోవడం లేదని చెప్పుకుంటున్నారు. నేతల కొట్లాటతో పరువుపోయి పాతాళంలోకి జారిన బీజేపీని కాస్త గట్టెక్కించేందుకు వచ్చే నెలలో మోదీ సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొంటున్నారు. ఆర్ఆర్ఆర్కు భూమి పూజ, రైల్వేలైన్ ప్రకటన వంటివన్నీ ఇందులో భాగమేనని అంటున్నారు.