హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కొనియాడారు. ఒక రాష్ట్రం కోసం ఉద్యమించి, దానిని సాధించడమే కాకుండా అనతికాలంలోనే తెలంగాణను దేశానికి రోల్మాడల్గా నిలిపిన ఒకే ఒక్కడుగా కేసీఆర్ చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. గల్వాన్ లోయ అమర సైనికుల కుటుంబాలకు, హైదరాబాద్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బీహార్కు చెందిన వలస కార్మికుల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం పాట్నాలో ఆర్థిక సహాయ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో బీహార్ సీఎం నితీశ్ మాట్లాడుతూ.. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిపై, తెలంగాణను.. సీఎం కేసీఆర్ను ఆకాశానికెత్తారు.
తెలంగాణ ప్రగతికోసం అహర్నిశలు శ్రమిస్తున్న గొప్ప నేత కేసీఆర్ అని నితీశ్ పేర్కొన్నారు. తెలంగాణను దేశానికి రోల్మాడల్గా తీర్చిదిద్దిన కేసీఆర్ను ఆ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ వదులుకోరని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి మార్గదర్శనంగా నిలిచాయన్నారు. 2001 నుంచి ఉద్యమించి, ప్రాణాలకు సైతం తెగించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారన్నారు. తెలంగాణ ఏర్పాటులో, వికాసంలో కేసీఆర్ భాగస్వామ్యం ఎంతో గొప్పదని నితీశ్ కీర్తించారు. ‘మీ గురించి అవగాహన లేని వారే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.
మీరు వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆత్మసె్థైర్యం కోల్పోకుండా పట్టుదలతో ముందుకు కొనసాగండి. మీ భాగస్వామ్యం చాలా గొప్పది. మీ ద్వారా తెలంగాణ అనే రాష్ట్రమే ఏర్పడింది. ఈ దేశంలో ఈ రకంగా పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మరెకడా.. మరెవ్వరికీ లేదు. అలా ఒక రాష్ట్రాన్ని సాధించిన వారు మీరు ఒకే ఒకరు. మీరు ఒక రాష్ట్రాన్ని సాధించిన మహానేత. అలాంటి మీ మీద ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళ విమర్శలన్నీ ఫాల్తు మాటలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎలా వదులుకొంటారు? వదులుకొనే ప్రసక్తే ఉండదు. మీరు పట్టు వదలకుండా మరింత శక్తి కూడగట్టుకొని మీ రాష్ట్రాభివృద్ధిని కొనసాగించండి’ అని నితీశ్కుమార్ అన్నారు.
దేశానికే మార్గదర్శకం
మిషన్ భగీరథ పథకం గొప్ప పథకమని, తెలంగాణలోని గ్రామ గ్రామానికి మంచినీటిని అందించడం చాలా గొప్ప కార్యమని నితీశ్ కు మార్ ప్రశంసించారు. ప్రజా సంక్షేమం, అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్ ఒక్కరికే సాధ్యమైందని అన్నారు. తాము కూడా ప్రజలకు తాగునీటిని గంగానది ద్వారా అందించాలని అనుకున్నా సాధ్యం కాలేదని చెప్పారు.
తెలంగాణ మాదిరిగా తమ అధికారులు అంత వేగంగా పని చేయలేకపోయారని పేర్కొన్నా రు. మిషన్ భగీరథను అధ్యయనం చేయడానికి తమ అధికారులను తెలంగాణకు పంపించామని.. తెలంగాణ ప్రేరణతో బీహార్లో నీటి సమస్యను త్వరలోనే అధిగమిస్తామని నితీశ్ విశ్వాసం వ్యక్తంచేశారు. గల్వాన్ లోయ అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, హైదరాబాద్ అగ్ని ప్రమాద దుర్ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షలు తెలంగాణ ప్రభుత్వం అందజేయడం గొప్ప విషయమన్నారు. కరోనా సమయంలోనూ బీహార్ వాసులను తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం సీఎం కేసీఆర్ ఉదారతకు తారాణమని తెలిపారు. కరోనా ఆపత్కాలంలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన కార్యాచరణను మరే ప్రభుత్వం చేయలేదన్నారు. తనకు హైదరాబాద్తో అవినాభావ సంబంధం ఉన్నదని, నగరం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతున్నదని ప్రశంసించారు. ప్రస్తుతం కేంద్రం రాష్ర్టాలకు అందించే నిధులలో కోత పెడుతున్నదని నితీశ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం మరిచిందని విమర్శించారు. బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా లభించి ఉంటే చాలా గొప్పగా అభివృద్ధి చెంది ఉండేదన్నారు.
కేసీఆర్ చొరవ స్ఫూర్తిదాయకం
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, ఈ దేశంలోని రాష్ట్రాలు తెలంగాణ మాదిరిగా పరస్పరం కష్ట సుఖాలను కలిసి పంచుకొన్నప్పుడే ఫెడరల్ వ్యవస్థ పరిఢవిల్లుతుందన్నారు. సీఎం కేసీఆర్ తీసుకొన్న చొరవ స్ఫూర్తి దాయకమని, శుభపరిణామమని పేర్కొన్నారు. ఇదే విధంగా పరస్పరం సహకరించుకుంటే దేశం అభివృద్ధి దిశగా పురోగమిస్తుందని తెలిపారు. రాష్ట్రాలతోనే దేశం నిర్మితమవుతుందని, వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం సహాయం అందించాల్సింది పోయి అణచివేస్తున్నదని ఆరోపించారు. సమాజంలో శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధికి అనువైన పరిస్థితులు నెలకొంటాయని అన్నారు.
స్వాగత తోరణాలు
సీఎం కేసీఆర్కు స్వాగతం చెపుతూ అభిమానులు పాట్నా వీధుల్లో అడుగడుగునా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘వెల్కమ్ టూ హోలీ లాండ్ ఆఫ్ పాటలీపుత్ర మిస్టర్ కే చంద్రశేఖర్రావు’ అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్కుమార్రెడ్డి, టీఆర్ఎస్నాయకులు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ నాయకులు, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ తదితరులున్నారు.
సీఎం వెన్నంటే ఉన్న తేజస్వీ
పర్యటన ముగిసేవరకు తేజస్వీ యాదవ్ సీఎం కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో తేజస్వీ యాదవ్ పాట్నా ఎయిర్పోర్ట్ వరకు వచ్చి సీఎం కేసీఆర్కు వీడ్కోలు పలికారు.
సీఎం కేసీఆర్కు బీహార్లో సాదర స్వాగతం
బీహార్ పర్యటన కోసం బుధవారం పాట్నా వెళ్లిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆ రాష్ట్ర సీఎం నితీశ్కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించారు. మెమొంటో బహూకరించారు. ముందుగా పాట్నా ఎయిర్ పోర్ట్కు వచ్చిన అధికారులు సీఎం కేసీఆర్ను ఎయిర్పోర్ట్లో ఆహ్వానించారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నితీశ్కుమార్ అధికార నివాసానికి తోడ్కొని వెళ్లారు. తన నివాసం వద్ద నితీశ్కుమార్ సీఎం కేసీఆర్కు ఘనంగా స్వాగతం పలికారు. నితీశ్కుమార్, తేజస్వీ, సీఎం కేసీఆర్.. ముగ్గురూ దాదాపు గంటన్నరపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహంపై ఏకాంతంగా చర్చలు జరిపారు.
పగిడీ కట్టి.. తల్వార్ పట్టి..
సీఎం కేసీఆర్ తన బీహార్ పర్యటనలో భాగంగా పాట్నా నగరంలోని గురుద్వారాను సందర్శించారు. బుధవారం బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ నివాసంలో కురువృద్ధ నేత లాలూప్రసాద్ యాదవ్ను పరామర్శించిన అనంతరం సీఎం కేసీఆర్ సికు మతస్థుల పుణ్య స్థలం.. గురు గోవింద్సింగ్ జన్మస్థలం పాట్నా గురుద్వారను చేరుకున్నారు. గురుద్వారా నిర్వాహకులు, దాదాపు వెయ్యి మంది సిక్కులు గౌరవ సూచకంగా సీఎం కేసీఆర్కు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికి సాదరంగా లోపలికి తీసుకువెళ్లారు. సీఎం కేసీఆర్కు పగిడీ కట్టి తల్వార్ ఇచ్చి గౌరవించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికు మతస్తులు అనుసరించే ప్రత్యేక పూజా పద్ధతులు, సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.