Bharat Jagruthi | హైదరాబాద్ : హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన తెలంగాణ సాహిత్య సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను ఎమ్మెల్సీ కవిత అందించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ గోరేటి వెంకన్న, డాక్టర్ తిరునగరి దేవకిదేవి, డాక్టర్ గోగు శ్యామల, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, డాక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి, పలువురు ప్రముఖ కవులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఎంత ముఖ్యమో మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలని జాగృతి ఉద్యమం చేసిందని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం సాహిత్య సభలు జరపాలని ఈ కార్యక్రమం రూపొందించామని తెలిపారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సాహిత్య సభల్లో అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చలు జరుగుతాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించుకున్నామని గుర్తు చేశారు. అందరిని భాగస్వామ్యం చేస్తూ ఈ సాహిత్య సభలు విజయవంతం చేసుకుందాం అని చెప్పారు. ఎవరి భాష వారికుంటది.. ఇదే మాట్లాడాలి అని అంటే తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. తెలంగాణ జాగృతి దేశంలో ఉన్న ప్రజలను జాగృతం చేసేందుకు భారత జాగృతిగా రూపుదిద్దుకుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.