Drinking Water | పదేండ్ల క్రితం 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోనూ తాగునీటికి కరువు. దూప తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. ప్లాస్టిక్ బిందెలు, ఆర్వో సెంటర్లు, కిలోమీటర్ల కొద్దీ నడక నిత్యం కనిపించిన దృశ్యం. అదే తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శుద్ధమైన జలం ప్రతి ఇంటి ముంగిట నల్లాలో ధారై పడుతున్నది. ఈ మార్పునకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక మిషన్ భగీరథ.
మరి 75 ఏండ్ల స్వతంత్ర భారతావని పరిస్థితి? ఈ ఎండల్లో అనేక రాష్ర్టాల్లో జనం తాగేందుకు గుక్కెడు నీళ్లులేక దాహం.. దాహం.. అని అలమటిస్తున్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ రాష్ర్టాలతోపాటు పేరు గొప్ప కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనూ తాగునీటి కోసం జనం నిత్యం న(డ)రకయాతన అనుభవిస్తున్నారు. దేశంలో ‘పానీ’పట్టు యుద్ధాలు జరుగుతుంటే తెలంగాణలో స్వచ్ఛమైన జలం నట్టింట్లోకి నడిచి వస్తున్నది. ఎవరు పనిమంతుడో దీన్ని బట్టి తేలడం లేదా?
పట్టు జారితే, ప్రాణం పోతుందనీ తెలుసు. అయినప్పటికీ.. ఓ అన్న 70 అడుగుల లోతున్న బావిలోకి దిగాడు. దేనికోసం?
మురికితో కుంట నిండి ఉన్నదని ఆ తల్లికి తెలుసు. అయినప్పటికీ, ముక్కు మూసుకొని బిందెను అందులో ముంచింది. ఎందుకు??
ఇకపై ఇంటి నుంచి పేపర్ ప్లేట్లు మీరే తెచ్చుకోండి అంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులకు సూచించింది. కారణమేంటి???
ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఒక్కటే.. నీటి గోస.
దాదాపుగా అన్ని రాష్ర్టాల్లో తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా అందుబాటులో లేని దుస్థితి నేడు దాపురించింది. తొమ్మిదేండ్ల బీజేపీ సర్కారు వెలగబెట్టిన ప్రగతికి నిదర్శనమీ ఈ కథనం.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): మానవ మనుగడకు నీళ్లు ఎంతో ఆవశ్యకం. ప్రజలకు నీళ్లను ఎంతిస్తున్నామన్న దానిపైనే దేశ ప్రగతి కూడా ఆధారపడి ఉంటుంది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో తెలంగాణ మిన హా ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. వేసవి వచ్చిందంటే చాలు.. గుక్కెడు తాగునీటి కోసం పిల్లాజెల్లతో కలిసి కిలోమీటర్ల మేర నడకసాగించాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిందెలతో లోతైన బావుల్లోకి దిగి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. సీఎం కేసీఆర్ సంకల్పంతో దేశంలోనే తెలంగాణలో ప్రతిరోజూ న ల్లాల ద్వారా స్వచ్ఛజలం నట్టింట్లోకి నడిచి వస్తున్నది. సమైక్య రాష్ట్రంలో బిందెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తెలంగాణ బిడ్డలకు.. ఇంటి బయటకు అడుగు పెట్టకుండానే స్వచ్ఛ, తియ్యని గోదారి, కృష్ణమ్మ నీళ్లు దోసిట్లోకి వస్తున్నాయి.
తెలంగాణ పథకాన్ని కాపీకొట్టి ‘హర్ ఘర్ జల్’ స్కీమ్ను తీసుకొచ్చిన కేంద్రం, దాన్ని అమలు చేయడంలోనూ వెనుకబడే ఉన్నది. 2022 నాటికి దేశంలోని ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందిస్తామన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ ఫీట్ను సాధించలేకపోయింది. దీంతో డెడ్లైన్ను 2024కు పొడిగించారు. ప్రస్తుతం దేశంలోని మొత్తం 19,44,50,316 ఇండ్లల్లో 11,92,10,886 ఇండ్లకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఇందులో 40 శాతం నల్లా కనెక్షన్లలో నీటి సరఫరా సక్రమంగా జరుగట్లేదని సమాచారం. మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణలో 53,98,219 ఇండ్లకు నల్లా కనెక్షన్లను ఇచ్చారు. తాగునీటి నాణ్యతా ప్రమాణాల్లో కూడా తెలంగాణదే అగ్రస్థానం. 99.953% నల్లా నీటిలో కలుషిత కారకాలు లేవని ఇటీవలి కేంద్ర జల్జీవన్ మిషన్ వాటర్ క్వాలిటీ నివేదికలో వెల్లడైంది.
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్, ఉత్తర గుజరాత్, మధ్య, దక్షిణ గుజరాత్లోని గిరిజన ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టు సమాచారం. ఈ జిల్లాల్లోని పట్టణాలు, గ్రామాల్లో వారానికి రెండు సార్లు కూడా నీటి సరఫరా చేయడం గగనంగా మారిపోయింది. 14 జిల్లాల్లోని సుమారు 500కి పైగా గ్రామాలకు ఇప్పటికీ ట్యాంకర్లతోనే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ సరఫరా కూడా వారానికి ఒకసారే. ఓట్లేస్తే నీళ్లిస్తామంటూ 2002 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం మోదీ హామీ ఇచ్చారని, 20 ఏండ్లు గడిచినప్పటికీ, ఇంకా తమ నీటి కష్టాలు తీరలేదంటూ 50 వేల మంది మహిళలు ఇటీవల ప్రధాని మోదీకి ఓ లేఖ కూడా రాశారు.
కర్ణాటకలోని బెంగళూరు నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. నగరంలోని కాలనీలు, ఐటీ కంపెనీలకు నీటి సరఫరా సక్రమంగా జరుగట్లేదు. నగర శివారుల్లోని చెరువుల్లో నీటి నిల్వలు అడుగంటిపోయాయని, దీంతో ట్యాంకర్లతో బయటి నుంచి నీటిని తెప్పిస్తున్నట్టు బెంగళూరు వాటర్ సైప్లె అండ్ సీవేజ్ బోర్డు (బీడబ్ల్యూఎస్ఎస్బీ) అధికారులు తెలిపారు. పౌరులు నీటిని వృథా చేయవద్దని, లేదంటే నీటి కోసం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలిత రాజస్థాన్నూ నీటి కష్టాలు వీడట్లేదు. వారంరోజులైనా నల్లా నీళ్లు రావట్లేదు. సమస్య పరిష్కా రానికి అధికారులు చర్యలు చేపట్టట్లేదు. సర్వ త్రా విమర్శలు రావడంతో రైళ్ల ద్వారా నీటిని పాలి తదితర ప్రాంతాల్లో ఒకసారి సరఫరా చేశారు. ఒక్కసారి సరఫరా చేసినంత మాత్రాన తమకు నీటి కష్టాలు ఎలా పోతాయని స్థానికులు నిలదీస్తున్నారు. కాగా రెండేండ్ల కిందట ఈ రాష్ట్రంలో తాగునీరు దొరక్క చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
తమిళనాడువ్యాప్తంగా తాగునీటికి కటకట ఏర్పడింది. రాజధాని చెన్నై సహా పరిసర పట్టణాల్లో భూగర్భజలాలు ఎన్నడూ చూడని స్థాయికి అడుగంటిపోయాయి. దీంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నది. చెన్నై శివారులోని పలు ఐటీ, ఎంఎన్సీలు తాగునీరు లేక క్యాంటీన్లు మూసివేస్తున్నాయి. అంతేకాదు, ఇంటి నుంచే భోజనం, తాగునీరు, పేపర్ ప్లేట్లు తెచ్చుకోవాలంటూ సిబ్బందికి సూచిస్తున్నాయి.
హర్యానాలోని పంచకులలో 3 రోజులపాటు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు అధికారులు చెప్పుకొచ్చారు. 72 గంటలైనా పరిష్కరించకపోవడంతో తాగడానికి నీళ్లు లేక సెక్టార్ 15 తదితర ప్రాంతాల్లోని వేలాదిమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఢిల్లీని కూడా నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. యమునా నదిలో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో నీటి సరఫరా స క్రమంగా జరుగట్లేదు. నీటిని వృథా చేయకుండా నిల్వ చే సుకోవాలంటూ ఢిల్లీ జల్ బోర్డు ప్రజలకు విజ్ఞప్తి చేసిం ది. నల్లా వచ్చిన ఆ కాసేపట్లోనే పెద్ద క్యాన్లు, డ్రమ్ము ల్లో నీటిని నింపిపెట్టుకొంటున్న వాళ్లు.. ఎవరైనా ఎత్తుకుపోతారని తాళాలు, చైన్లతో వాటి మూతలను లాక్ చేస్తున్నారు.
ఒడిశాలోని కందమాల్, రాయగఢ తదితర ప్రాంతాల్లో నీటి కష్టాలు అన్నీఇన్నీ కావు. పాఠశాల టాయిలెట్లలో కూడా నీళ్లు లేని పరిస్థితి అక్కడ నెలకొన్నది. దీంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి విద్యార్థులు ఎర్రటెండలో దగ్గర్లోని కాలువలకు పరుగుతీయాల్సిన దుస్థితి దాపురించింది. ఇక తాగునీటి అవసరాల కోసం సమీప గ్రామాల్లోని మహిళలు 3 కిలోమీటర్ల దూరంలో తుమిదిబందాలో ఉన్న చెలిమ నుంచి నీటిని తెచ్చుకొని గృహావసరాలకు వాడుకొంటున్నారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దు చిత్రకూట్ జిల్లా గిరిజన ప్రాంతాల్లో ప్రతి వేసవిలో తీవ్ర నీటిఎద్దడి తలెత్తుతుంది. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా లేకపోవడంతో మహిళలు కిలోమీటర్లు నడిచి అడవుల్లోని చిన్న కుంటల నుంచి మురికి నీటినే వస్ర్తాలతో వడబోసి తెచ్చుకొంటున్నారు. రాముడు నడయాడిన నేలమీద నీటి కష్టాలను ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. బుందేల్ఖండ్లోని పలు జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులు. యూపీలోని సోన్భద్ర జిల్లాలోని పలు గ్రామాల్లో నల్లా కనెక్షన్ లేక కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో నుంచి రోజూ నీళ్లు తెచ్చుకొంటున్నారు. వడదెబ్బ తాకడంతో పలువురు దవాఖానల్లో చేరుతున్నారు. యూపీలోని వందలాది గ్రామాల్లోని ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.
బీహార్లోని 15 జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు దాపురించాయి. రెండేండ్లుగా వేసవిలో నీటికష్టాలు ఎదుర్కొంటున్నామని, అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, ఏపీ, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, పంజాబ్ సహా ఈశాన్య రాష్ర్టాల్లోనూ నీటి కొరత ఉన్నట్టు సమాచారం.
గత పది రోజులుగా చుక్క నీరు కూడా నల్లా నుంచి రావట్లేదని పశ్చిమ బెంగాల్లోని సహపూర్ గ్రామస్థులు నిరసనలకు దిగారు. 50 మందికి పైగా మహిళలు ఖాళీ బకెట్లు, గిన్నెలతో ప్రదర్శన చేపట్టారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించకపోతే, ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చే ప్రజాప్రతినిధులు, ఇప్పుడు వీధుల్లోకి ఎందుకు రావట్లేదని నిలదీశారు.
మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లా ఖూస్రా గ్రామంలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ఆ గ్రామంలోని అబ్బాయిలకు పిల్లనిచ్చేందుకు చుట్టుపక్కల ఊర్లవాళ్లు భయపడుతున్నారు. ఎందుకంటే తాగునీటి కోసం ఆ ఊళ్లో వాళ్లు కిలోమీటర్ల మేర నడవాల్సిందే. ఊర్లో ఏ ఒక్క ఇంటికీ నల్లా కనెక్షన్ లేదు. వందల అడుగుల లోతున బోర్లు వేసినా చుక్క నీళ్లు రావట్లేదు. కిలోమీటర్ల దూరంలో ఎక్కడో అడవిలో ఉన్న చిన్న నీటి కాలువే ఖుస్రా గ్రామ ప్రజలకు ఆధారంగా మారిపోయింది. దీంతో ‘నీటికష్టాలున్న ఆ ఊరికి మా బిడ్డలను ఎలా పెండ్లి చేసి పంపిస్తామ’ని సమీప గ్రామప్రజలు అంటున్నారు. నీటికష్టాల గురించి కిందటేడాదే ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని సర్పంచ్ నేన్సింగ్ ఠాకూర్ వాపోయారు.
మహారాష్ట్ర రాజధాని ముంబై, పుణెలో నీటి కటకట నెలకొన్నది. శివారు కాలనీలకు బీఎంసీ అవసరమైన మోతాదులో నీటిని సరఫరా చేయట్లేదని స్థానికులు వాపోతున్నారు. దీంతో బోర్లలో ఉప్పునీటినే తాగాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముంబైకి సమీపంలో ఉన్న తాన్సా, భాట్సా, మోదక్సాగర్, తులసీ, విహార్, అప్పర్ వైతరణా, మిడిల్ వైతరణా వంటి ఏడు జలాశయాల నుంచి నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే, మొత్తం సామర్థ్యంలో ఆ జలాశయాల్లో ప్రస్తుతం 19.5 శాతం మాత్రమే నీళ్లున్నాయి. ముంబైకి రోజుకు 420 కోట్ల లీటర్ల నీరు అవసరపడుతుంది. ప్రస్తుతం ఉన్న నిల్వలతో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడం కష్టమేనని బీఎంసీ అధికారులు తలలు పట్టుకొంటున్నారు. పుణె జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ కాంప్లెక్స్లకు స్థానిక పాలక సంస్థల నుంచి రోజుకు 25 లీటర్ల కంటే తక్కువగా తాగునీరు సరఫరా చేస్తున్నారంటూ సొసైటీల ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఔరంగాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో వారానికి ఒకసారి కూడా తాగునీరు అందట్లేదు.
తాగునీటికోసం నాసిక్ జిల్లాలోని గంగోద్బారీ ప్రజలు ప్రాణాలకు తెగిస్తున్నారు. దాహంతో అలమటిస్తున్న పసిపిల్లల గొంతు తడపడానికి 70 అడుగుల లోతున్న బావిలో తాళ్ల సాయంతో దిగుతున్నారు. ఏ మాత్రం పట్టుతప్పినా ప్రాణానికే ప్రమాదమని తెలిసీ తెగిస్తున్నారు. ‘దాహంతో ప్రాణం పోగొట్టుకోవడం కంటే ఇదే మేలు’ అని పలువురు స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు.