వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 19: రాష్ట్రంలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలో కొవిడ్ రోగులకు అందుతున్న సేవలపై వైద్యులతో మంత్రి సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 1370 పడకల సామర్థ్యమున్న ఎంజీఎంలో 440 పడకలతో కరోనా బాధితుల కోసం కొవిడ్-19 విభాగాన్ని ఏర్పాటుచేశామని తెలిపారు. అందులో 100 వెంటిలేటర్లు, 100 పడకలతో ప్రత్యేక ఇంటెన్సివ్కేర్ యూనిట్తో సేవలు అందిస్తున్నామని చెప్పారు. చికిత్సకు అవసరమైన ఆక్సీజన్, మందులు, ఇంజక్షన్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని స్పష్టంచేశారు. అనుమానితులకు రాపిడ్ టెస్టులు చేసేందుకు తగిన వసతులు కల్పించామని, ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను రెట్టింపు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశామని వెల్లడించారు. బాధితులు చివరి క్షణాల్లో వైద్యసేవల కోసం కాకుండా సరైన సమయంలో వైద్యులను సంప్రదించినట్లయితే మరణాల రేటును తగ్గించవచ్చని అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మృతిచెందిన వారిలో ఎక్కువ మంది చివరి క్షణాల్లో చేరుతున్న వారు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారేనని చెప్పారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే హోం ఐసొలేషన్ చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. బాధితులకు ధైర్యాన్ని కల్పించడం అత్యంత ముఖ్యమని, తప్పుడు ప్రచారం చేసి ఆందోళనకు గురిచేయవద్దని మీడియాను కోరారు. సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, డీఎంహెచ్ఓ డాక్టర్ కే లలితాదేవి, ఎంజీఎం విభాగాధిపతులు పాల్గొన్నారు.