అచ్చంపేట, మే 24 : ఎలుగుబంటి దాడి నుంచి యజమానురాలిని కాపాడేందుకు ఓ పెంపుడు శునకం గొప్ప పోరాట పటిమ కనబరిచింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం చెంచుగూడెంలో చోటుచేసుకున్నది. బాధితుల కథనం మేరకు.. చెంచుగూడెం గ్రామానికి చెందిన చెంచు మహిళ నిమ్మల సాలమ్మ, చంద్రయ్య దంపతులు ఆదివారం మేకలను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లారు. గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పవనకుంట అడవిలో మేకలను తోలుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎలుగుబంటి సాలమ్మపై దాడికి తెగబడింది.
ఈ క్రమంలో చంద్రయ్య కూడా భయపడటంతో ఆ సమయంలో వారి వెంట వచ్చిన పెంపుడు శునకం ఎలుగుబంటిపై మొరుగుతూ దానిచుట్టూ తిరుగుతూ ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించింది. శునకం అరుపులు, చంద్రయ్య కేకలతో ఎలుగుబంటి కంగారుపడి చివరకు సాలమ్మను వదిలి అడవిలోకి పారిపోయింది.
‘మా కుక్క లేకపోతే నా భార్య ప్రాణాలతో బయటపడేది కాదు’ అంటూ సాలమ్మ భర్త వాచర్ రాములు భావోద్వేగానికి గురయ్యాడు. ఎలుగుబంటి దాడిలో సాలమ్మ భుజం, చెంప, చెవి భాగాల్లో గాయాలయ్యాయి. ఆమెను అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు.