కరీంనగర్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో చదువుకునే బీసీ బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసేందుకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్.. తాజాగా మరో వరం ప్రకటించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రీమెట్రిక్ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులను పోస్టుమెట్రిక్ విద్యార్థులకూ వర్తింపజేందుకు అనుమతినిస్తూ బుధవారం జీవో జారీ చేయించినట్టు తెలిపారు. తద్వారా రాష్ట్రంలో 34 వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధిచేకూరుతుందని చెప్పారు. బుధవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడారు.
బీసీ బిడ్డలకు పోస్ట్మెట్రిక్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకోవడం బీసీలపై ఆయనకున్న ప్రేమకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మూడు నుంచి పదోతరగతి వరకు 30,712 మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరికి సన్నబియ్యం భోజన వసతితోపాటు పూర్తి స్థాయిలో కాస్మెటిక్ చార్జీలు, ఉలెన్ బ్లాంకెట్స్, బెడ్ షీట్స్, కార్పెట్స్, నోట్బుక్స్ తదితర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని 302 పోస్ట్మెట్రిక్ హాస్టళ్లలోని 34 వేల మందికిపైగా బీసీ విద్యార్థులు చదువుతున్నారని, వీరికి ప్రస్తుతం భోజన, వసతి మాత్రమే ఉన్నదని అన్నారు. బుధవారం విడుదలైన జీవో ప్రకారం ఇకనుంచి ప్రీ మెట్రిక్ విద్యార్థుల మాదిరిగానే కాస్మోటిక్ చార్జీలతోపాటు ఇతర అన్ని సదుపాయాలు వర్తిస్తాయని తెలిపారు. బీసీ బిడ్డల సంక్షేమం కోసం దేశంలోనే ఈ తరహా నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి అని, దేశంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు.
స్వదేశీ విద్యా పథకానికి రేపు నామకరణ
దేశంలోని 200కుపైగా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివే బీసీ బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నందున ఈ పథకానికి పేరు పెట్టడంతోపాటు లోగోను, విధివిధానాలను ఈ నెల 28న హైదరాబాద్లో ఆవిష్కరిస్తామని మంత్రి గంగుల తెలిపారు. బీసీ బిడ్డలకు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎంతో అండగా నిలిచే ఈ గొప్ప పథకాన్ని చాలా ఆర్భాటంగా ప్రారంభించుకోవాలని నిర్ణయించామని, అందుకోసం 28న ఉదయం 10 గంటలకు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కేంద్రంలో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
బీసీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వీ శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం నేతలు ఆర్ కృష్ణయ్యతోపాటు అనేక మంది బీసీ ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ తదితర విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు వర్తింపచేసే ఈ పథకంతోపాటు ప్రస్తుతం బీసీ విద్యార్థులకు అమలవుతున్న అన్ని విద్యా సంబంధిత శాఖలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.