కాచిగూడ, జనవరి 18: ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వరంగా మారుతుందని జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇంగ్లిష్ మీడియం వల్ల ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు దూసుకుపోతాయని, దీంతో విద్యార్థుల భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని తెలిపారు. సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్యక్షతన కాచిగూడలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి రూ.7,300 కోట్లతో ‘మన ఊరు-మన బడి’ పథకాన్ని ప్రవేశపెట్టాలని క్యాబినెట్ తీసుకొన్న నిర్ణయం విప్లవాత్మకమైనదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు ఇంగ్లిష్ విద్య దూరమవుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించి అందరినీ అశ్యర్యపరిచారని అన్నారు. ఇంగ్లిష్ విద్యతోనే పేద విద్యార్థుల బతుకులు మారుతాయని చెప్పారు.సీఎం కేసీఆర్ మానవతాదృక్పథంతో ప్రభుత్వ పాఠశాలల్లోని 24 వేల టీచర్ పోస్టులు, ఎయిడెడ్ పాఠశాలల్లో 4,900 పోస్టులు, గురుకుల పాఠశాలల్లో 1,500 పోస్టులు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లోని ఖాళీలనువెంటనే బర్తీ చేయాలని కోరారు.కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు లాల్ కృష్ణ, కోలా జనార్దన్, పగిడాల సుధాకర్ముదిరాజ్, జిల్లాపల్లి అంజి, లక్ష్మణ్యాదవ్,లక్ష్మ, భవ్య, పండరినాథ్ తదితరులు పాల్గొన్నారు.