హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల కోసం 1.20 కోట్ల జాతీయ జెండాలను విజయవంతంగా తయారుచేసిన సిరిసిల్ల నేతన్నలు.. అదే ఉత్సాహంతో బతుకమ్మ చీరల ఉత్పత్తిలో నిమగ్నమయ్యారు. కోటి చీరల లక్ష్యంలో భాగంగా రోజుకు లక్ష చొప్పున ఇప్పటికే 80 లక్షల చీరలు సిద్ధంచేశారు. వచ్చేనెల 10వ తేదీలోగా మిగిలిన 20 లక్షల చీరల తయారీకి పనులను వేగవంతం చేశారు.
కొన్నేండ్లుగా ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా 18 ఏండ్లు నిండిన బీపీఎల్ మహిళలందరికీ ఉచితంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని నేతన్నలను ఆదుకొనే ఉద్దేశంతో ప్రభుత్వం సిరిసిల్లలోని నేత కార్మికులకే చీరల తయారీ బాధ్యతలు అప్పగిస్తున్నది. చీరల కోసం ఈ ఏడాది రూ.338 కోట్లు కేటాయిస్తున్నది. సెప్టెంబర్ 25న బతుకమ్మ పండుగ నాటికి లబ్ధిదారులకు పంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బహిరంగ మార్కెట్లో లభ్యమవుతున్న చీరల తరహాలోనే వివిధ రంగులు, విభిన్న డిజైన్ల చీరలను రూపొందిస్తున్నట్లు వారు వివరించారు.
నేతన్నలకు ఆసరాగా
సిరిసిల్లలో సుమారు 35 వేల పవర్లూమ్స్ ఉన్నాయి. ఏటా బతుకమ్మ చీరలను ప్రభుత్వం అక్కడే తయారు చేయిస్తున్నది. ఏటా 20 కోట్ల మీటర్ల వస్ర్తాలు తయారు చేసే సామర్థ్యం గల పవర్లూమ్స్ ఉండగా, బతుకమ్మ చీరలు సహా క్రిస్మస్, రంజాన్ బహుమతులు, కేసీఆర్ కిట్లు, స్కూలు పిల్లల యూనిఫామ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన బట్టలు తదితర అన్నీ కలిపి 10 కోట్ల మీటర్ల వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. మిగిలిన వస్ర్తాలను వారు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా సిరిసిల్లలోని మరమగ్గాలపై ప్రభుత్వ ఆర్డర్లే అధికంగా ఉంటున్నాయి. వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన నేతన్నలు మహారాష్ట్ర, బెంగాల్, ఒడిశా బీహార్ తదితర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు.