ఛత్రపతి శివాజీ గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అజ్ఞానంతో ముస్లిం వ్యతిరేకిగా హిందూ పక్ష చక్రవర్తిగా చిత్రీకరిస్తూ ప్రజలను బీజేపీ నేతలు తప్పు దోవ పట్టిస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నలుగురైదుగురు బి.జి.పి. ప్రజాప్రతినిధులు ప్రజా సేవా కార్యక్రమాలపై శ్రద్ధ చూపకుండా ప్రజల మధ్య మతద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ సందర్భంగా బి.జె.పి. ప్రజాప్రతినిధులు ప్రవర్తించిన తీరును ఆయన ఖండించారు.
బీజేపీ నేతలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని ప్రజలు ప్రశ్నిస్తుండటంతో అసహనానికి గురియై, టి.ఆర్.ఎస్. నాయకులపై నిందలు వేస్తూ అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు. మనది లౌకికవాద దేశము కాబట్టి అన్ని వర్గాల ప్రజలను సమాన దృష్టితో చూస్తూ వారి సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని , అప్పుడే ప్రజలు ఆదరిస్తారని బాజిరెడ్డి గోవర్ధన్ హితవు పలికారు.
ఆర్.టి.సి.లో కారుణ్యనియామకాలు, కొత్తబస్సుల కొనుగోలు పై ప్రతిపాదనలు
ఆర్టీసీని ఎలాగైనా బ్రతికించుకోవాలనే పట్టుదలలో సీఎం కేసీఆర్ ఉన్నారని, అందుకే తనను చైర్మన్ గా, సజ్జనార్ను మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారని, నాటినుండి సంస్థ ఉద్యోగులందరినీ కలుపుకుని సంస్థ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. సమష్టి కృషితో సంస్థ క్రమక్రమంగా పూర్వ వైభవం దిశగా పయనిస్తోందని, కార్మికులకు 1 వ తారీఖునే వేతనాలను చెల్లిస్తున్నామని, పి.ఎఫ్ బకాయిలను సైతం చెల్లిస్తున్నామని తెలియజేసారు.
రిటైర్ అవుతున్న ఉద్యోగులకు చెల్లించడానికి దాదాపు అయిదు వందల కోట్లు అవసరమవుతుందని, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సర్దుబాటు చేస్తామని, 2828 కొత్త బస్సుల కొనుగోళ్లతో పాటు 1200 కారుణ్య నియామకాలకై ప్రతిపాదనలను సి.ఎం.దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు.