Makthal | మక్తల్, సెప్టెంబర్ 6 : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల క్రీడా, విద్యా వికాసానికి కృషి చేస్తున్న ఓ ఫిజికల్ డైరెక్టర్కు అంతర్జాతీయ స్థాయిలో విద్యా విధానాలను అధ్యయనం చేసే అరుదైన అవకాశం లభించింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ బి.రూప (SA–Physical Education) జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను జపాన్ పర్యటనకు పంపుతోంది. సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో రాష్ట్రానికి చెందిన 29 మంది ఉపాధ్యాయులు, 11 మంది విద్యాశాఖ అధికారులు పాల్గొంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, నిరుపేద విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడంతో పాటు.. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ఈ పర్యటనలో భాగంగా బి.రూప జపాన్లోని విద్యా సంస్థలను సందర్శించి అక్కడి క్రమశిక్షణ, సాంకేతికత వినియోగం, జీవన నైపుణ్యాల బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, పాఠశాల నిర్వహణ విధానాలను పరిశీలించనున్నారు. జపాన్లో అమలు చేస్తున్న ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేసి.. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అనుసరించదగిన విధానాలపై అవగాహన పొందనున్నారు. ఈ అనుభవం భవిష్యత్తులో విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందించేందుకు ఉపయోగపడనుంది.
కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న బి.రూప విద్యార్థుల క్రీడా, విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆమెకు అంతర్జాతీయ స్థాయి విద్యా పర్యటనకు అవకాశం దక్కడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల నుంచి జపాన్ వరకు బి.రూప సాగిస్తున్న ఈ ప్రయాణం కర్ని పాఠశాలకే కాకుండా నారాయణపేట జిల్లాకు కూడా గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. జపాన్ పర్యటన విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.