హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఎంత ప్రాధాన్యమిస్తున్నదో.. అనుబంధ రంగమైన పశు సంవర్ధకానికి కూడా అంతే ప్రాధాన్యమిస్తున్నది. రాష్ట్రంలో పశుసంరక్షణకు పశుసంవర్థకశాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నది. గతేడాది ఏడాది లక్ష్యాన్ని మించి ప్రగతి సాధించింది. పశువులు, మేకలు, గొర్రెల్లో అంటువ్యాధులు ప్రభలకుండా భారీస్థాయిలో టీకా కార్యక్రమం చేపట్టింది. నట్టల నివారణ, గుండె వాపు, జబ్బ వాపు, చిటుకు వ్యాధి, పారుడు వ్యాధి, అమ్మవారు, మచూచి, గాలికుంటు వంటి వ్యాధుల నివారణకు టీకాలు వేశారు. ఇందుకు సంబంధించి 100 శాతం లక్ష్యం పూర్తి చేసింది. పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో భారీఎత్తున కృత్రిమ గర్భదారణ నిర్వహించారు.
కృత్రిమ గర్భదారణలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఇందులోభాగంగా గతేడాది సుమారు 2 లక్షల మేలు రకమైన దూడలు పుట్టాయి. రాష్ట్రంలో పశుగ్రాసం కొరత పూర్తిగా పరిష్కారమయింది. అవసరమైన ప్రతి రైతుకు సబ్సిడీకింద పశుగ్రాస విత్తనాలను 75శాతం సబ్సిడీతో అందజేశారు. పశువులకు నీడ కోసం ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణం చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 57 వేల ఖర్చుతో వీటిని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 3,631 షెడ్ల నిర్మాణం పూర్తయింది. పశు సంవరక్షణపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు గ్రామాల్లో సదస్సులను నిర్వహించారు.
మూగజీవాల రక్షణకు అన్ని చర్యలు
మూగ జీవాల సంరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. పశు సంపదలో దేశంలోనే తెలంగాణ మేటిగా నిలుస్తున్నది. పాల ఉత్పత్తిని పెంచేందుకు ఆవులు, గేదెల కృత్రిమ గర్భదారణను నిర్వహిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పశుసంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
ప్రతి అంశంలో లక్ష్యాన్ని పూర్తి చేశాం
జీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం నిర్దేశించిన 10 అంశాల్లో లక్ష్యానికి మించి పనిచేశాం. పశు సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పశుగ్రాసం కొరత లేకుండా గతేడాది 2వేల టన్నుల విత్తనాలను సరఫరా చేశాం. పశు సంరక్షణలో మంత్రి సహకారంతో ముందుకెళ్తున్నాం.