హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఇతర రాష్ర్టాలతో పోల్చుకుంటే తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన మహిళా భద్రతా విభాగం సమర్థవంతంగా పనిచేస్తున్నదని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ ప్రశంసించారు. శుక్రవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జాతీయ మహిళా కమిషన్, తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. వివాహ రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేయడం ద్వారా ఎన్నారై (ప్రవాస భారతీయ) భర్తల మోసాలకు చెక్ పెట్టవచ్చునని చెప్పారు. ఎన్నారై వివాహ మోసాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 5,858 కేసులు తమ వద్ద పెండింగ్లో ఉన్నట్టు వివరించారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. విదేశీ సంబంధాల విషయంలో పూర్తి వివరాలు ముందుగానే తెలుసుకునేలా యువతులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. పంజాబ్లో హాలిడే వైఫ్ కల్చర్ పెరుగుతున్నదని, ఎన్నారైలు అక్కడి యువతులను వివాహమాడి, కొన్నాళ్లు గడిపి, వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. భారతదేశ చట్టాల ప్రకారం వివాహమాడిన ఎన్నారైలు విదేశీ చట్టాల ప్రకారం విడాకులు ఇస్తున్నారని అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై వివాహ మోసాలపై తమకు 15 ఫిర్యాదులు అందాయని తెలిపారు. మహిళా భద్రతా విభాగం, లీగల్ సర్వీసెస్ అథారిటీ తదితర సంస్థల సమన్వయంతో ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు వివరించారు.
తెలంగాణలో ఇప్పటివరకు ఎన్నారై వివాహ మోసాల కేసులు 728 నమోదయ్యాయని రాష్ట్ట్ర మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా తెలిపారు. మహిళా భద్రతా విభాగంలో 2019 నుంచి ఇప్పటివరకు 239 కేసులు నమోదు కాగా 42 కేసులను పరిషరించినట్టు వెల్లడించారు. ఈ కేసుల్లో ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, సౌదీ అరేబియా, కెనడా దేశాలకు సంబంధించినవి ఉంటున్నాయని తెలిపారు. సమావేశంలో డీఐజీ సుమతి, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎంవీ రమేశ్, రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య హైదరాబాద్లోని వివిధ దేశాల కాన్సులేట్ అధికారులు, రాష్ట్ర పోలీస్ సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఎన్నారై సెల్ విభాగం పనితీరు అనే అంశంపై రూపొందించిన పుస్తకాన్ని రేఖాశర్మ ఆవిషరించారు.