హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): వైద్యశాఖలో స్టాఫ్ నర్సుల భర్తీకి నిర్వహిస్తున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్కు కొందరు అభ్యర్థులు ‘ఎన్వోసీ’ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) తీసుకోకుండానే హాజరైనట్టు తెలుస్తున్నది. 317 జీవోతో ప్రభావితమైన స్టాఫ్ నర్సుల్లో సుమారు 200 మందికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయినట్టు నర్సింగ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. వారి వల్ల అర్హులైన ఇతర అభ్యర్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తుది జాబితా విడుదల చేసేలోగానే వారిని గుర్తించి, అర్హులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు (ఎంహెచ్ఎస్ఆర్బీ)కి విజ్ఞప్తి చేస్తున్నారు. 317 జీవో అమలు చేసినప్పుడు అనేక మంది పట్టణాల నుంచి పల్లెలకు, ఇతర జిల్లాలకు వెళ్లిపోయారు. ముఖ్యంగా హైదరాబాద్లో స్థిరపడిన కొందరు జిల్లాలకు బదిలీ అయ్యారు. వీరిలో సుమారు 600 మంది స్టాఫ్నర్సులు తమకు అన్యాయం జరిగిందంటూ గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడంతో కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తున్నదని, తిరిగి పాత స్థానాలకు పంపించాలని కోరారు. ఇది ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నది. అయితే కొందరు అభ్యర్థులు తమకు నచ్చిన ప్రాంతంలో పోస్టు వస్తుందనే ఉద్దేశంతో ఇటీవల జరిగిన స్టాఫ్నర్స్ రిక్రూట్మెంట్లో పరీక్ష రాశారు. వారికి మెరిట్ మార్కులు రావడంతో ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు. వారంరోజులుగా జరుగుతున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరై, ప్రక్రియ పూర్తిచేసుకున్నారు. అయితే.. సర్వీస్లో ఉన్న నర్సులు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసే సమయంలో ‘ఎన్వోసీ’ సమర్పించాల్సి ఉంటుందని నర్సింగ్ యూనియన్లు చెప్తున్నాయి. పనిచేస్తున్న హాస్పిటల్లోని అధికారుల అనుమతితో డీఎంహెచ్వో, డీపీహెచ్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కానీ సుమారు 200 మంది వరకు ఎన్వోసీలు ఇవ్వకుండానే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అర్హులైన అభ్యర్థులకు అన్యాయం
సర్వీస్లో ఉన్న నర్సులు ఇలా చేయడం వల్ల అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. సెలక్షన్ లిస్ట్ ప్రకటించిన తర్వాత వారికి ఎంప్లాయీ ఐడీలు ఇచ్చే క్రమంలో ఆధార్, ఇతర వివరాలు తీసుకున్నప్పుడు వారు అప్పటికే సర్వీస్లో ఉన్న విషయం తెలుస్తుందని అంటున్నారు. ఎన్వోసీ లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటారని, దీంతో ఆ పోస్టు భర్తీ కాకుండా ఖాళీగా మిగిలిపోతుందని చెప్తున్నారు. దీంతో అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. వెరిఫికేషన్ సమయంలోనే వారిని గుర్తించి జాబితా నుంచి తొలిగిస్తే న్యాయం చేసినవారవుతారని చెప్తున్నారు. ఎవరెవరు ఎన్వోసీలు ఇవ్వలేదు? ఏయే జిల్లాల్లో ఉన్నారు? అందుకు గల కారణాలు ఏమిటి? అనే అంశాలను పరిశీలించిన తర్వాత, వారిపై చర్యలు తీసుకున్న అనంతరమే ఎంపిక జాబితా విడుదల చేయాలని కోరుతున్నారు. 7,094 స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి 1:1.25 పద్ధతిలో 9892 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలిచారు. కాబట్టి ఎన్వోసీ లేనివారిని పక్కనబెట్టినా మరోసారి వెరిఫికేషన్ నిర్వహించాల్సిన అవసరం రాకపోవచ్చని సూచిస్తున్నారు.