వెంగళరావునగర్, ఏప్రిల్ 12 : ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలలో పెట్టే రూ.1.20 కోట్లకుపైగా నగదు గల్లంతైన ఘటన వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.1, 20,98,500 నగదు లోటు ఉన్నట్టు అధికారులు నిర్ధారించి ఎస్ ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్లోని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ సంస్థ సిబ్బంది వివిధ బ్యాంకుల నుంచి నగదు తీసుకొని ఏటీఎంలలో జమచేస్తుంటారు. మేనేజ్మెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా కస్టోడియన్లు నగదు తీసుకువెళ్లి ఏటీఎంలలో నింపుతుంటారు.
ఇందులో భాగంగా తరచూ ఆడిట్ కూడా నిర్వహిస్తుంటారు. తాజాగా నిర్వహించిన ఆడిట్లో నగదు లోటు ఉన్నట్టు గుర్తించడంతో ఎస్ ఆర్ నగర్ పరిధిలోని 31 ఏటీఎంలను తనిఖీ చేశారు. ఇందులో 8 ఏటీఎంలలో పెట్టే నగదు గల్లంతైనట్టు వెల్లడైంది. దీంతో సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ సంస్థ మేనేజర్ నవీన్ శనివారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు తీసుకొచ్చే ఇద్దరు కస్టోడియన్లపై అనుమానం వ్యక్తమవుతున్నది. వారు విధులకు హాజరుకాకపోవడం, ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో వారిపై అనుమానం వ్యక్తంచేశారు. దీంతో పోలీసులు పరారీలో ఉన్న కస్టోడియన్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.