హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): పాస్పోర్ట్ సేవల ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా అధికారులు చేపట్టిన ‘ప్రతి శనివారం ప్రత్యేక పాస్పోర్ట్ డ్రైవ్’ నేడు కూడా కొనసాగుతుందని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాల కారణంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందని, దరఖాస్తుదారులు ఇప్పటికే వారి స్లాట్స్ బుక్ చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. సాధారణ, తత్కాల్, పీసీసీ కేటగిరిల్లో 3700 స్లాట్స్ బుక్ చేసుకున్నట్టు తెలిపారు. 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లోని సేవలు కొనసాగుతాయని వివరించారు. కేటాయించిన షెడ్యూల్ సమయంలో సంబంధిత కార్యాలయాలకు హాజరు కావాలని సూచించారు.